Elon Musks : ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ ఏ ముహూర్తంలో చేజిక్కించుకున్నారోగానీ… ఆయన వచ్చినప్పటి నుంచి అంతా గందరగోళమే. రావడం రావడంతోనే బోర్డు డైరెక్టర్లను. కొందరు టాప్ ఎంప్లాయిస్ ని, సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలిచారు. ఉన్నవారిని కూడా పనిచేయకుండా చేస్తున్నారట. రోజుకో అల్టిమేటం జారీ చేస్తుండడంతో ట్విట్టర్ సంస్థలో గందరగోళం నెలకొంది. కంపెనీ అభివ్రుద్ధి కోసం కష్టపడి పనిచేస్తారా… లేక వెళ్లిపోతారా అంటూ ఆయన బుధవారం ఉద్యోగులకు పంపిన మెయిల్ తో కలకలం రేగింది. తమ అంగీకారం తెలపాల్సిందిగా ఒక ఫాంని కూడా పంపించారు. అది ఫిల్ చేస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తోయోనని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. వెళ్లాలనుకుంటే మూడు నెలల నోటీస్ ఇవ్వండి అని మస్క్ అనడంతో… అందుకు ఓకే చెబుతూ చాలా మంది ఉద్యోగులు వెళ్లిపోవడానికి రెడీ అయినట్లు బ్లామ్ బెర్గ్ వెల్లడించింది. కంపెనీ అంతర్గత సమాచార వేదికల్లో ఉద్యోగులంతా సెల్యూట్ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నట్లు సమాచారం.
వెళ్లిపోవాలని భావిస్తున్నవారిలో ట్విట్టర్ పనితీరు గురించి బాగా తెలిసిన ఉన్నత స్థాయి ఉద్యోగులు, ఇంజినీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ట్విట్టర్ ఉనికికే ప్రమాదం రానుందని గ్రహించిన కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విద్వేషం రెచ్చగొట్టేలా పోస్టులు వెల్లువెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే అమెరికా ప్రభుత్వం దీనిపై రివ్యూ చేపట్టి ఒక నిర్ణయం తీసుకుంటే… ట్విట్టర్ మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం లేకపోలేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దంటూ ఉద్యోగులకు కంపెనీ లేఖలు రాసినట్లు బ్లూమ్ బెర్గ్ తెలిపింది.
చీటికి మాటికి హెచ్చరికలు జారీ చేస్తుండడంతో విసిగిపోయిన ఉద్యోగులు ఎలాన్ మస్క్ కు షాకివ్వడం హాట్ టాపిక్ అయింది. దీంతో దిగివచ్చిన ఎలాన్ మస్క్… వెళ్లొద్దంటూ ఉద్యోగులకు మస్కా కొడుతున్నట్లు సమాచారం. మస్క్ పంపిన ఫారం నింపడానికి కొన్ని గంటల సమయమే మిగిలి ఉండడంతో… వెళ్లొద్దని బతిమాలుతూ మస్క్ ఉద్యోగులకు లేఖ రాశారని తెలుస్తోంది. ఇప్పటివరకు పెట్టిన నిబంధనల్లో కొన్నింటిని సడలించడానికి కూడా మస్క్ దిగివచ్చినట్లు సమాచారం. మరి ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది.