Hitec City Railway Station Redevelopment: హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పూర్తిగా కొత్త రూపును సంతరించుకుంది. భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమృత్ స్టేషన్ పథకం కింద సుమారు రూ.26 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ ను ఆధునీకరించారు. అన్ని పనులు పూర్తవడంతో త్వరలోనే ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది.
హైదరాబాద్లోని ఐటీ కారిడార్కు అత్యంత సమీపంలో ఉన్న ఈ స్టేషన్ ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతోంది. అందుకే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్టేషన్ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. పునరాభివృద్ధి పనుల్లో భాగంగా స్టేషన్కు కొత్త ఎంట్రెన్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేలా ఎంట్రీ మార్గాలు విశాలంగా రూపొందించారు. ఇప్పటికే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జికి అదనంగా 12 మీటర్ల వెడల్పుతో మరో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. దీంతో ఒక ప్లాట్ ఫారమ్ నుంచి మరో ప్లాట్ ఫారమ్ పైకి వెళ్లడం మరింత సులభం కానుంది. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న రెండు లిఫ్టులకు అదనంగా మరో రెండు కొత్త ప్రయాణికుల లిఫ్టులు, అలాగే రెండు ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలు, దివ్యాంగులకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి.
ప్రయాణికుల సౌకర్యాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. కొత్త టాయిలెట్ బ్లాక్ లు, విశాలమైన వెయిటింగ్ హాల్, ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేపింగ్, రాత్రివేళల్లో అందంగా కనిపించే ఫసాడ్ లైటింగ్, మంచి సైన్ బోర్డులు సహా పలు సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లింగంపల్లి–సికింద్రాబాద్ సబర్బన్ రైల్వే మార్గంలో ఉంది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంతో పాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది కీలక కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ స్టేషన్లో సబర్బన్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఈ స్టేషన్ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్, ఉమ్దానగర్, ఫలక్నుమా, మేడ్చల్, ఘట్ కేసర్ లాంటి ప్రాంతాలకు రోజుకు సుమారు 62 రైళ్లు నడుస్తున్నాయి. రోజుకు దాదాపు 3 వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు.
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే అమృత్ స్టేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఆ దిశగా హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు ఆధునిక రూపాన్ని సంతరించుకుని, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది.
Read Also: టికెట్ లేకున్నా వారిని రైల్లో నుంచి దించకూడదట, ఇండియన్ రైల్వేలో చాలామందికి తెలియని సేఫ్టీ రూల్..