Sonam Wangchuk: లడఖ్ పర్యావరణ పరిరక్షణ కోసం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ గత కొద్ది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 28 నుంచి ఆయన సాగిస్తున్న నిరవధిక సత్యాగ్రహం వల్ల ఆయన శరీరం క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు తక్షణ అత్యవసర వైద్య సేవలు అందించేలా కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై దిల్లీ హైకోర్టు బుధవారం స్పందించింది. ఈ విషయమై తక్షణమే స్పందించాలని కేంద్రంతో పాటు దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను గురువారం (జులై 16వ తేదీ)కి వాయిదా వేసింది.
సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సైనీ స్వయంగా వర్చువల్ విధానంలో కోర్టుకు హాజరై ఈ పిటిషన్ను దాఖలు చేశారు. వాంగ్చుక్ సుదీర్ఘ కాలంగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆయన ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సైనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీక్ష ప్రారంభించినప్పటి నుండి ఆయన దాదాపు 8.25 కిలోల బరువు తగ్గారని, రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం, కళ్లు తిరగడం, కండరాల బలహీనత వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు. ఒక పౌరుడి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకూడదని ఆయన వాదించారు.
ఈ పిటిషన్ ను అత్యవసరమైనదిగా పరిగణించిన జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన డివిజన్ బెంచ్.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానవ ప్రాణం చాలా విలువైందని, దీనిపై కేంద్ర ప్రభుత్వ అదనపు సాలిసిటర్ జనరల్, దిల్లీ ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని రేపటికల్లా తెలియజేయాలని ఆదేశించింది. అయితే జిల్లా కోర్టుల పరిధి పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ న్యాయవాదులు విధులను బహిష్కరించినప్పటికీ.. కేసు తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం గమనార్హం.
Also Read: కాణిపాకం హుండీలో కాసుల వర్షం.. 22 రోజుల్లో పోటెత్తిన విరాళాలు.. లెక్కలు చూస్తే షాకే!
మరోవైపు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సైనీ కీలక డిమాండ్లను పొందుపరిచారు. సోనమ్ వాంగ్చుక్కు తక్షణమే అత్యవసర చికిత్సతో పాటు అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని కోరారు. ఆయన లేవనెత్తిన పర్యావరణ, లడఖ్ ప్రత్యేక హోదా అంశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలన్నారు. నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కే అయినప్పటికీ.. పౌరుడి జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఇదిలా ఉంటే వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో రేపటి దిల్లీ హైకోర్టు విచారణలో ఎలాంటి ఆదేశాలు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: పెద్దలకు ఉపయోగపడే.. అద్భుతమైన బ్లూటూత్ డివైజ్లు.. ఇక ఎవరిపై ఆధారపడక్కర్లేదు!