Long Life Tips: మారుతున్న జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోతే ప్రమాదకర వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామంతో పాటు, ఫుడ్ విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇవన్నీ చేయకపోయినా ఓ రూల్ పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
95 శాతం ప్రజలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. మధుమేహం, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన వ్యాధులు రావడానికి జీవనశైలి ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధుల వల్ల కలిగే మరణాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కేవలం 5 నిమిషాల రూల్ ఫాలో అవ్వడం వల్ల చాలా వ్యాధులు మన దరికి చేరవు.
కొలంబియా మెడికల్ యూనివర్సిటీ పరిశోధన బృందం 11 మంది వాలంటీర్లను ఎంపిక చేసుకుంది. వారిని 8 గంటల పాటు కుర్చీల్లో కూర్చోబెట్టి..ల్యాప్టాప్లలో పని చేయడం,సెల్ ఫోన్లను ఉపయోగించుకునేలా అవకాశం కల్పించారు. అయితే వారంతా 40 నుంచి 60 ఏళ్లలోపు వారు. మొదట కొన్నిరోజులు ఎనిమిది గంటల పాటు ఎక్కువగా నడవకుండా కూర్చొని వారి పనులు వారు చేసుకున్నారు. తరువాత రోజుల్లో వారు ప్రతి అరగంటకు ఒక నిమిషం, ప్రతి గంటకు ఒక నిమిషం, ప్రతి అరగంటకు ఐదు నిమిషాలు, చివరకు ప్రతి గంటకు ఐదు నిమిషాలు ఇలా వారిని నడవమని చెప్పారు. వీరిని ఇలా కొన్ని రోజుల పాటు పరిశీలించారు.
Also Read: తినే ముందు మామిడి పండ్లను నీటిలో నానబెట్టండి.. లేదంటే ప్రమాదంలో పడతారు !
ప్రతి అరగంటకు 5 నిమిషాలు నడవడం వల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలను చాలా వరకూ తగ్గించవచ్చని పరిశోధనలో తేలింది. ఇలా నడవడం వల్ల రక్తపోటు తగ్గుతుందని గుర్తించారు. రోజంతా కూర్చోవడంతో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిని 58 శాతం తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక స్థితి, అలసట, పనితీరు స్థాయిలను పరిశీలించినప్పుడు శారీరక శ్రమ చేసేవారు తక్కువ అలసిపోయినట్లు తెలిపారు. నడకతో మానసిక స్థితి మెరుగుపడినట్లు వెల్లడించారు. వ్యాయామం చేయని వారి కంటే ఇలా నడిచే వ్యక్తులు కనీసం ఐదేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.