Food for Kids: పిల్లల ఎదుగుదల దశలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం కూడా ఎంతో ముఖ్యం. నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు చదువులోనూ, ఆటల్లోనూ రాణించాలంటే వారి మెదడు చాలా చురుగ్గా ఉండాలి. మెదడు కణాల అభివృద్ధి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడంలో మనం ఇచ్చే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. జంక్ ఫుడ్కు దూరంగా ఉంచి, మెదడుకు శక్తినిచ్చే ‘బ్రెయిన్ ఫుడ్స్’ను వారి దైనందిన జీవితంలో భాగం చేయడం ద్వారా వారి మేధస్సును రెట్టింపు చేయవచ్చు. ఆ అద్భుతమైన ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం.
పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ఆహారాలు:
పిల్లల మెదడు అభివృద్ధిలో 90% ఐదేళ్ల లోపే జరుగుతుంది. కానీ కౌమారదశ వరకు మెదడు కణాలు నిరంతరం మార్పు చెందుతూనే ఉంటాయి. ఈ సమయంలో సరైన పోషకాలు అందకపోతే ఏకాగ్రత లోపించడం, త్వరగా మర్చిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
1. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన నట్స్ (వాల్నట్స్ & బాదం):
మెదడులో ఎక్కువ భాగం కొవ్వుతో నిర్మితమై ఉంటుంది. ముఖ్యంగా వాల్నట్స్ (వాల్నట్స్ చూడటానికి మెదడు ఆకారంలోనే ఉండటం విశేషం) లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పని తీరును వేగవంతం చేస్తాయి. బాదంలో ఉండే విటమిన్ E జ్ఞాపకశక్తి క్షీణించకుండా కాపాడుతుంది. రోజుకు 4-5 నానబెట్టిన బాదం పప్పులు ఇవ్వడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది.
2. రంగురంగుల బెర్రీలు, పండ్లు:
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, నల్ల ద్రాక్షల్లో ‘ఆంథోసైనిన్స్’ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరుస్తాయి. అలాగే విటమిన్ C పుష్కలంగా ఉండే నారింజ, జామ వంటి పండ్లు మెదడు చురుగ్గా ఉండటానికి, ఒత్తిడి తగ్గడానికి సహాయ పడతాయి.
3. గుడ్లు,పాల ఉత్పత్తులు:
గుడ్డులోని పచ్చసొనలో ‘కోలిన్’అనే విటమిన్ ఉంటుంది. ఇది మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాలను అభివృద్ధి చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే పాలు, పెరుగులో ఉండే విటమిన్ B12, ప్రోటీన్లు మెదడు కణజాలం పెరుగుదలకు తోడ్పడతాయి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ వల్ల జీర్ణక్రియ బాగుండి, మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది.
4. ఆకుకూరలు, కూరగాయలు:
పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో ఫోలేట్, విటమిన్ K, లూటిన్ ఉంటాయి. ఇవి మెదడు వయస్సు పెరగకుండా, జ్ఞాపకశక్తి పదిలంగా ఉండేలా చూస్తాయి. అలాగే క్యారెట్లు, బీట్రూట్ వంటి కూరగాయలు మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. బీట్రూట్ రసం మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి ఏకాగ్రతను పెంచుతుంది.
5. తృణధాన్యాలు, పప్పులు:
మెదడు నిరంతరం పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. ఓట్స్, రాగులు, జొన్నలు వంటి తృణధాన్యాల నుంచి అందే శక్తి మెల్లగా రక్తంలోకి చేరుతుంది. దీని వల్ల పిల్లలు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పప్పుధాన్యాల్లో ఉండే జింక్ ,మెగ్నీషియం మెదడు ఎదుగుదలకు, నాడీ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం.
జాగ్రత్తలు, చిట్కాలు:
కేవలం ఆహారమే కాకుండా.. పిల్లలు రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగేలా చూడాలి. డీహైడ్రేషన్ వల్ల మెదడు త్వరగా అలసిపోతుంది. చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, సోడాలు మెదడు పని తీరును నెమ్మదింపజేస్తాయి. కాబట్టి వాటిని నివారించాలి.