చర్మాన్ని అందంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవాలని అందరికీ ఉంటుంది. చర్మ సౌందర్యం కోసం వాడే వాటిలో ఎక్కువగా వినిపించే పేరు ముల్తాని మట్టి. పాత కాలం నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఈ మట్టిని ఫేస్ ప్యాక్లుగా వాడుతున్నారు. ఇది చర్మాన్ని శుభ్రపరచడంలో, మొటిమలను తగ్గించడంలో, చర్మానికి సహజమైన గ్లో ఇవ్వడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ముల్తాని మట్టి మార్కెట్లో సాధారణంగా రెండు రూపాల్లో దొరుకుతుంది. ఒకటి స్టోన్ (గడ్డ రూపంలో), మరొకటి పౌడర్ (పొడి రూపంలో). ఈ రెండింటిలో ఏది చర్మానికి ఎక్కువగా ఉపయోగపడుతుందనే సందేహం చాలా మందికి ఉంటుంది.
ముల్తాని మట్టి పొడి
ముల్తాని మట్టి పౌడర్ రూపం ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది మార్కెట్లో చాలా సులభంగా దొరుకుతుంది. వాడటం కూడా చాలా సులభం. పౌడర్ను ఒక బౌల్లో తీసుకుని అందులో రోజ్ వాటర్, పాలు, పెరుగు లేదా అలొవెరా జెల్ కలిపి ఫేస్ ప్యాక్లా ముఖానికి రాసుకోవచ్చు. ఇది కొద్దిసేపట్లోనే సిద్ధమవుతుంది. అందుకే బిజీగా ఉండే వారు ఎక్కువగా పౌడర్ ముల్తాని మట్టినే ఉపయోగిస్తారు. అయితే కొన్నిసార్లు మార్కెట్లో లభించే పౌడర్లో ఇతర పదార్థాలు కలిపి ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also read: Raw milk: ముఖానికి పచ్చిపాలు రాస్తే చర్మం మెరిసిపోవడమే కాదు మురికి మొత్తం పోతుంది
ముల్తాని మిట్టి స్టోన్
ఇక ముల్తాని మట్టి స్టోన్ గురించి చెప్పుకోవాలి. ఇది సహజమైన రూపంగా భావిస్తారు. ఇది చిన్న గడ్డలుగా దొరుకుతుంది. పాత కాలంలో ఎక్కువగా ఇదే వాడేవారు. ఈ గడ్డలను ముందుగా నీటిలో కొంతసేపు నానబెట్టి, తర్వాత నూరి లేదా మెత్తగా చేసి ఫేస్ ప్యాక్లా వాడేవారు. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేదా ఇతర పదార్థాలు కలిసే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల చాలా మంది దీనిని ఎక్కువగా సహజమైనదిగా భావిస్తారు. అయితే దీన్ని ఉపయోగించడానికి కొంచెం సమయం, శ్రమ అవసరం అవుతుంది.
ముల్తాని మట్టి చర్మానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది చర్మంలోని అదనపు ఆయిల్ను తగ్గిస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ముఖంలోని మురికి, దుమ్ము, మృత కణాలను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. దీని వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది. మొటిమలు వచ్చే సమస్య కూడా కొంతవరకు తగ్గుతుంది. అలాగే చర్మం మృదువుగా మారి సహజమైన కాంతి వస్తుంది. అందుకే చాలా మంది బ్యూటీ నిపుణులు కూడా ముల్తాని మట్టిని ఫేస్ ప్యాక్లలో ఉపయోగించాలని సూచిస్తుంటారు.
అయితే ముల్తాని మట్టిని ఉపయోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చర్మంలోని ఆయిల్ను ఎక్కువగా తీసేస్తుంది. అందువల్ల ఎక్కువగా వాడితే చర్మం పొడిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వాడటం మంచిది. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్నవారు ముల్తాని మట్టిలో పాలు లేదా తేనె కలిపి వాడితే చర్మం పొడిబారకుండా ఉంటుంది. స్టోన్ ముల్తాని మట్టి, పౌడర్ ముల్తాని మట్టి రెండింటి ప్రయోజనాలు దాదాపు ఒకటే. కానీ సహజత్వం విషయంలో స్టోన్ ముల్తాని మట్టి కొంచెం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉపయోగించడం పరంగా చూస్తే చాలా మంది పౌడర్ ముల్తాని మట్టినే ఎంచుకుంటున్నారు. ఏ రూపంలో వాడినా సరే, సరైన విధంగా వాడితే ముల్తాని మట్టి చర్మానికి మంచి ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.