India’s Most Beautiful Railway Station: దేశ వ్యాప్తంగా సుమారు 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత అందమైన రైల్వే స్టేషన్. ఇక్కడ బోలెడు సినిమాలు షూట్ చేశారు. సినీ లవర్స్ ఈ స్టేషన్ ను సినిమాలో చూసి ఉంటారు. కానీ, దాని గురించి పెద్ద వివరాలు తెలియకపోవచ్చు. ఇండియాలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్ తమిళనాడులో ఉంది. నీలగిరి మౌంటైన్ రైల్వేలో భాగంగా ఉన్న కెట్టి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కు చెందిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కెట్టి రైల్వే స్టేషన్ ప్రకృతి అందాల నడుమ అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్ లో టైల్స్ వేసిన పైకప్పు, ఇనుప బెంచీలతో ఖాళీగా వర్షంతో తడిసిన స్టేషన్ కనిపిస్తుంది. స్టేషన్ లో ఎక్కడా చెత్త లేకుండా అత్యంత శుభ్రంగా కనిపిస్తుంది. ఎత్తైన చెట్లు, పొగమంచు పర్వతాలు ఈ స్టేషన్ అందాన్ని మరింతగా పెంచుతున్నాయి.
కెట్టి రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి 2092 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది దక్షిణ రైల్వే జోన్ లో భాగంగా కొనసాగుతోంది. ఈ స్టేషన్ అందమైన దృశ్యాలు, ఊటీకి సామీప్యత, నీలగిరి పర్వత రైల్వేలో భాగంగా ఉండటం వల్ల బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేషన్ లో ఐకానిక్ చిత్రం ‘మూండ్రం పిరై’ క్లైమాక్స్ లో కనిపిస్తుంది. శ్రీదేవి, కమల్ హాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఎండింగ్ ఈ స్టేషన్ లోనే ఉంటుంది. ఈ సన్నివేశాన్ని కెట్టి రైల్వే స్టేషన్ లో ఐదు రోజుల పాటు చిత్రీకరించారు.
కెట్టిని ఊటీ టాయ్ ట్రైన్ అని పిలువబడే నీలగిరి పర్వత రైల్వే ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణంలో 16 సొరంగాలు, 208 వంపులు, 250 వంతెనలు ఉన్నాయి. ఇది ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. కూనూర్, వెల్లింగ్టన్, కెట్టి, అరవంకడు లాంటి అందమైన పట్టణాలు మౌంటైన్ రైల్వే ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది.
నీలగిరి మౌంటైన్ రైల్వేలో 72 ఫస్ట్ క్లాస్ సీట్లు, 100 సెకండ్ క్లాస్ సీట్లు ఉన్నాయి. ఈ క్యారేజీలు పూర్తిగా నీలం, క్రీమ్ షేడ్స్ లో కలపతో తయారు చేయబడ్డాయి. ప్రతిరోజూ నడుస్తున్న 46 కి.మీ పొడవున్న మీటర్ గేజ్ సింగిల్ ట్రాక్ నీలగిరి పర్వత రైల్వే దక్షిణ భారతదేశంలోని ఏకైక పర్వత రైల్వే. దేశంలోని పర్వత రైల్వేలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిగణిస్తారు. కెట్టి రైల్వే స్టేషన్ నీలగిరి పర్వత రైల్వేతో పాటు వారసత్వ సంపద కేటగిరీలోనే ఉంది. ఈ రైలు ఐదు గంటల్లో 46 కి.మీ. ప్రయాణిస్తుంది.ఈ రైలు మెట్టుపాళయం నుంచి ఉదయం 7:10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఊటీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటలకు ఊటీ నుంచి బయలుదేరి సాయంత్రం 5:35 గంటలకు మెట్టుపాళయం చేరుకుంటుంది. IRCTC అధికారిక వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
Read Also: నార్త్ కొరియాలో రైళ్ల స్పీడ్ మరీ అంత తక్కువా? వాటిలోనూ జనాలు వెళ్లరా?