Prima: కంటిచూపు లేక శాశ్వత అంధత్వంతో బాధపడుతున్న లక్షలాది మంది జీవితాల్లో వైద్య శాస్త్రం ఇప్పుడు ప్రకాశవంతమైన వెలుగుల్ని నింపుతోంది. వయసు పెరగడం వల్ల వచ్చే తీవ్రమైన కంటి సమస్య (ఏజ్-రిలేటెడ్ మాక్యులార్ డీజెనరేషన్ – AMD) కారణంగా పూర్తిగా కంటి చూపును కోల్పోయిన వారు సైతం ‘ప్రిమా’ అనే వైర్లెస్ రెటీనా ఇంప్లాంట్ సాయంతో మళ్లీ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. చూపులేని వారిలో ఈ కొత్త టెక్నాలజీ ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ‘ప్రిమా’ అనే పరికరం సాయంతో అంధులు సులభంగా అక్షరాలను, పదాలను చదవగలుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా వృద్ధులు ఏజ్-రిలేటెడ్ మాక్యులార్ డీజెనరేషన్ (AMD) కారణంగా శాశ్వత అంధత్వంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి చికిత్స అందించేందుకు యూనివర్సిటీ కాలేజ్ లండన్, పిట్స్బర్గ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు సంయుక్తంగా ఈ ‘ప్రిమా’ పరికరాన్ని అభివృద్ధి చేశారు. PRIMA అనేది వైర్లెస్ రెటీనా ఇంప్లాంట్ (Wireless Retina Implant). ఇది కంటిలో అమర్చే సూక్ష్మ చిప్ రూపంలో ఉంటుంది. చూపును కోల్పోయిన వారికి మళ్లీ చూడగల శక్తిని అందిస్తుంది.
పూర్తిగా కంటిచూపును కోల్పోయిన బాధితులకు మళ్లీ చూపు తెప్పించే క్లినికల్ ట్రయల్స్లో భాగంగా.. 32 మంది రోగులకు ఈ పరికరాన్ని అమర్చారు. ఓ సంవత్సరం తరువాత పరిశీలించగా, వారిలో 27 మంది అక్షరాలను స్పష్టంగా చదవగలిగినట్లు తేలింది. ఈ పరికరం పనితీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రిమా అనే ప్రత్యేకమైన కళ్లద్దాలలో ఒక చిన్న కెమెరా అమర్చి ఉంటుంది.
కంటిలోని రెటీనాలో 2×2 మిల్లీమీటర్ల వైర్లెస్ చిప్ను ఇంప్లాంట్ చేశారు. కళ్లద్దాల కెమెరా బయటి దృశ్యాలను చిత్రీకరించి, ఆ సమాచారాన్ని ఇన్ఫ్రారెడ్ కాంతి రూపంలో కంటిలోని చిప్పైకి పంపుతుంది. ఆ చిప్ కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చి, రెటీనాలోని మిగిలిన కణాలను ఉత్తేజపరిచి, ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. తద్వారా అంధులు దృశ్యాలను చూడగలుగుతారు. ప్రస్తుతం వారికి అన్ని చిత్రాలు తెలుపు-నలుపు చిత్రాలుగానే కనిపిస్తాయని, తర్వాతి దశల్లో చిప్నకు మరిన్ని మెరుగులు దిద్దుతారని, అప్పుడు పూర్తి రంగుల్లో అంధులు అన్నింటినీ చూడగలరని తెలిపారు.
శాశ్వత అంధులకు చూపును తిరిగి తెప్పించే ప్రయత్నంలో ఇంత పెద్ద సంఖ్యలో రోగులపై ఇలాంటి సానుకూల ఫలితాలు రావడం ఇదే మొదటిసారనీ 80%కి పైగా రోగులు అక్షరాలు, పదాలు చదవగలుగుతున్నారని, వారిలో కొందరు పుస్తకంలోని పేజీలను కూడా చదువుతున్నారని పరిశోధకులు తెలిపారు. ఈ ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో 84% మంది తమ రోజువారీ పనులకు ఈ కృత్రిమ దృష్టిని వాడుతున్నారట. అంధత్వంతో బాధపడే ఓ వ్యక్తి ఏకంగా 12 లైన్ల వరకు చదవగలిగేలా దృష్టిని మెరుగుపరచుకోవడం విశేషం. ఈ టెక్నాలజీని యూనివర్సిటీ కాలేజ్ లండన్, స్టాన్ఫోర్డ్ మెడిసిన్, పిట్స్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి అభివృద్ధి చేశారు.