DK Aruna: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన వల్ల తెలంగాణ ఇప్పటికే ఆగమైందని పాలమూరు ఎంపీ డీకే అరుణ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సమక్షంలో పలువురు యువకులు కాషాయ పార్టీలో చేరారు. వారికి డీకే అరుణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డీకే అరుణ మాట్లాడుతూ..
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ను సీరియస్ గా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఎస్ఐఆర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. బోగస్ ఓట్లను తొలగించేలా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రణాళిక రూపొందించుకుని పోరాటాలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, విధానాలు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్తపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కేవలం కేంద్రం నిధులతోనే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు పైసా లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై విమర్శలు
కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడానికి అబద్ధపు హామీలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని, ప్రజలను కాంగ్రెస్ మాయలో పడకుండా అప్రమత్తం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ను నమ్మి మరోసారి పొరపాటు చేయవద్దని ప్రజలను చైతన్యం చేయాలని డీకే అరుణ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ హయంలో ఒక్క కుటుంబం అవినీతి చేసేదని, కానీ ప్రస్తుతం పైనుంచి కింది వరకు అంతా అవినీతే జరుగుతోందన్నారు. కమీషన్ చెల్లించకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నాయని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిన ఎస్ఐ.. నిలదీస్తే ‘నా ఇష్టం’ అంటూ హల్చల్!
బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది..
ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, లేదంటే తెలంగాణ అంధకారంగా.. మరింత అప్పుల కూపంలోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ద రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్ర రెడ్డి, మాజీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అప్సర్ పాషా, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకటరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కేకే రెడ్డి, శ్యామ్ రావు, శివారెడ్డి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.