Hyderabad to Andharban Trek: వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి మహారాష్ట్రలోని అంధర్ బన్ ట్రెక్ అద్భుతమైన డెస్టినేషన్ గా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కూడా ఈ ప్రాంతానికి ఈజీగా చేరుకోవచ్చు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పశ్చిమ కనుమలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జలపాతాలు ఉప్పొంగుతూ, అడవులు మరింత అందంగా మారాయి. పూణే సమీపంలోని సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న అంధర్ బన్కు మరాఠీలో “చీకటి అడవి” అనే పేరు ఉంది. దట్టమైన చెట్ల కారణంగా పగటిపూట కూడా ఈ ప్రాంతం చల్లగా, నీడతో కనిపిస్తుంది. అందుకే ప్రకృతి ప్రేమికులను ఈ ప్రదేశం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.
చాలా ట్రెక్కింగ్ ప్రాంతాల్లో కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. కానీ, అంధర్ బన్ ట్రెక్ మాత్రం కొండ దిగువ వైపు సాగే ప్రత్యేకమైన మార్గం. మొత్తం ట్రెక్ దాదాపు 13 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దట్టమైన అడవులు, చిన్న సెలయేళ్లు, నాచుతో కప్పబడిన రాళ్లు, అందమైన జలపాతాల మధ్య ఈ ప్రయాణం సాగుతుంది. వర్షాకాలంలో పొగమంచుతో కప్పుకున్న లోయలు, రంగురంగుల అడవి పూలు ఈ ట్రెక్ ను మరింత అందంగా మారుస్తాయి. మధ్య మధ్యలో కనిపించే లోయ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
ఈ ట్రెక్ తామ్హిని ఘాట్ సమీపంలోని పింప్రి గ్రామం వద్ద ప్రారంభమై, రాయగడ్ జిల్లాలోని భీరా డ్యామ్ బ్యాక్ వాటర్స్ దగ్గర ముగుస్తుంది. మొత్తం ట్రెక్ పూర్తి చేయడానికి సాధారణంగా 5 నుంచి 7 గంటలు పడుతుంది. కాస్త శారీరక దృఢత్వం ఉన్నవారు, తొలిసారి ట్రెక్కింగ్ చేసే వారు కూడా దీన్ని హ్యాపీగా పూర్తి చేయవచ్చు.
హైదరాబాద్ నుంచి అంధర్బన్కు వెళ్లేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. విమానంలో పూణే చేరుకుని అక్కడి నుంచి టాక్సీలో ట్రెక్ ప్రాంతానికి వెళ్లొచ్చు. రైలులో హైదరాబాద్ నుంచి పూణే చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. సొంత కారులో వెళితే సుమారు 10 నుంచి 11 గంటల ప్రయాణం ఉంటుంది. పూణే నుంచి అనేక ట్రెక్కింగ్ గ్రూపులు వీకెండ్ టూర్లను కూడా నిర్వహిస్తుంటాయి.
అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు రోజుకు కేవలం 700 మంది ట్రెక్కర్లకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఆన్ లైన్ లో ముందుగానే రిజిస్ట్రర్ చేసుకోవాలి. 16 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అటవీ శాఖ అనుమతించిన గైడ్ తోనే ట్రెక్ చేయాలి. మొబైల్ సిగ్నల్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు. గుర్తింపు కార్డు, బుకింగ్ వివరాలను తీసుకెళ్లాలి. ట్రెక్కింగ్కు వెళ్లే వారు మంచి గ్రిప్ ఉన్న వాటర్ ప్రూఫ్ షూ ధరించాలి. రెయిన్ కోట్, పాంచో వెంట తీసుకెళ్లాలి. తాగునీరు, లైట్ ఫుడ్, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉండటం మంచిది. మొబైల్ ఫోన్, కెమెరా లాంటి వస్తువులను వాటర్ ప్రూఫ్ బ్యాగ్ లో ఉంచాలి. అడవిలో చెత్త వేయకుండా పరిశుభ్రతను కాపాడుతూ, గైడ్ చెప్పినట్లుగా ముందుకు సాగితే ఈ మాన్సూన్ ట్రెక్ మరపురాని అనుభూతిని అందిస్తుంది.
Read Also: 4 వేల కి.మీ దూరంలో ఇండియాలా కనిపించే మరో దేశం.. భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం!