Joy e-Bike Water Scooter Prototype: భవిష్యత్ రవాణా వ్యవస్థలో కాలుష్యాన్ని తగ్గించే కొత్త టెక్నాలజీలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే జాయ్ ఇ-బైక్ సంస్థ నీటితో నడిచే ప్రత్యేక స్కూటర్ను ప్రదర్శించింది. ప్రస్తుతం ఇది ప్రోటోటైప్ దశలో ఉన్నప్పటికీ, ఈ టెక్నాలజీ ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ స్కూటర్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసేలా రూపొందిస్తోంది.
ఈ స్కూటర్ను సాధారణ పెట్రోల్, ఎలక్ట్రిక్ తో కాకుండా హైడ్రోజన్ శక్తితో నడిచేలా రూపొందించారు. ఇందులో ఉపయోగించే హైడ్రోజన్.. డిస్టిల్డ్ వాటర్ నుంచి సేకరించే విధానాన్ని కంపెనీ ప్రదర్శించింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి, ఆ శక్తితో మోటార్ పని చేస్తుంది. దీంతో వాహనం ముందుకు కదులుతుంది.
ఈ హైడ్రోజన్ స్కూటర్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి హైడ్రోజన్ ఇంధనం నింపితే సుమారు 55 కిలోమీటర్ల వరకు వెళ్లే సామర్థ్యం ఉంటుంది. ప్రస్తుతం ఇది నగరాల్లో చిన్న దూరాల ప్రయాణానికి అనువైన కాన్సెప్ట్ వాహనంగా రూపొందించింది. ఈ స్కూటర్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒకవేళ ప్రయాణం మధ్యలో హైడ్రోజన్ అయిపోవడం లేదంటే బ్యాటరీలో పవర్ అయిపోతే, వాహనానికి అమర్చిన పెడల్స్ ను ఉపయోగించి సైకిల్ లా తొక్కుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుడు ఇబ్బంది పడకుండా గమ్యస్థానానికి చేరుకునే వీలుంటుంది.
ఈ టెక్నాలజీ రూపొందించడానికి ప్రధాన కారణం పర్యావరణహితమైన ప్రయాణం. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా పనిచేసే వాహనాల్లో హానికరమైన పొగ, కర్బన ఉద్గారాలు దాదాపు ఉండవు. అందువల్ల కాలుష్యాన్ని తగ్గించడంలో ఇలాంటి వాహనాలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ స్కూటర్ ప్రస్తుతం కమర్షియల్ అమ్మకాలకు అందుబాటులో లేదు. కేవలం టెక్నాలజీ సామర్థ్యాన్ని చూపించడానికి తయారు చేసిన కాన్సెప్ట్ మోడల్ మాత్రమే. దీనిని ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువస్తారనే విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే ధర, పూర్తి సాంకేతిక వివరాలు, ఉత్పత్తి ప్రారంభ తేదీ లాంటి సమాచారం కూడా వెల్లడించలేదు.
మరోవైపు, జాయ్ ఇ-బైక్ సంస్థ ఇప్పటికే భారత మార్కెట్లో పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. రోజువారీ ప్రయాణాలకు అనువైన వివిధ మోడళ్లను వినియోగదారులకు అందిస్తోంది. భవిష్యత్తులో హైడ్రోజన్ టెక్నాలజీ విజయవంతమైతే, ఇలాంటి వాహనాలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిశోధనలు, పరీక్షలు పూర్తయిన తర్వాతే ఇది సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: బాబోయ్.. మహిళల పేరుతో కారు కొంటే ఇన్ని లాభాలా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!