Ancient Sculptures: సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాళ్ల ఆకారాలు ప్రస్తుతం స్థానికులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మండలంలోని నూర్జంపేట, గూడేపుకుంట గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ఒక గుట్టపై మనుషులను పోలిన రకరకాల ఆకారాల్లో బండరాళ్లు దర్శనమిస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఈ గుట్టలపై మనిషి తలను పోలిన ఒక పెద్ద బండరాయితో పాటు.. ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక ఋషి తల రూపాన్ని పోలిన మరో రాయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వినూత్నంగా ఉన్న ఈ ప్రకృతి వింతను చూసేందుకు నూర్జంపేట, గూడేపుకుంట, మాచారం వంటి పొరుగు గ్రామాల ప్రజలే కాకుండా.. సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
అయితే తరతరాల నుంచి ఈ రాళ్లు ఇక్కడే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు ఈ ప్రాంతంలో సమగ్ర పరిశోధనలు జరిపితే మరిన్ని చారిత్రక రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. ప్రధాన రహదారికి సమీపంలోనే ఉన్న ఈ గుట్టను గుర్తించి.. ప్రభుత్వం తగిన సదుపాయాలు కల్పించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే.. సమీపంలోని నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలోని ‘రెక్కల స్తంభం గండి’ వద్ద అరుదైన మానవ ఆకారపు శిల్పం కూడా వెలుగు చూసింది. కాకతీయ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగానికి చెందిన పీహెచ్ డీ విద్యార్థి సంగు వెంకటరెడ్డి ఈ చారిత్రక ఆధారాలను గుర్తించారు. ప్రస్తుతం ఈ శిల్పం కూడా స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పీహెచ్డీ విద్యార్థి సంగు వెంకటరెడ్డి ఈ శిల్పాల గురించి మాట్లాడుతూ.. కీలక విషయాలను వెల్లడించారు. ఇవి క్రీ.పూ 1200 – 300 కాలానికి చెందిన మెగాలిథిక్ యుగానికి చెందినవని తెలిపారు. నాటి కాలంలో మరణించిన తమ నాయకుడి జ్ఞాపకార్థం లేదా దేవుడిగా భావించి ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి ఉంటారని వివరించారు.
Also Read: ఒకే ఒక్క టికెట్తో.. ఆటో + బస్సు జర్నీ.. ఆర్టీసీ ఈ-ఆటోలు వచ్చేస్తున్నాయ్!
ఇదిలా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొత్తూరు మొట్లగూడెం, భూపతిపురం, మంగపేట, కోడాకండ్ల, గలబ, దొంగతోగు, కేసారం వంటి పలు ప్రాంతాల్లోనూ ఇటువంటి ప్రాచీన శిల్పాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడ కూడా పురవాస్తుశాఖ అధికారులు పరిశోధనలు చేస్తే.. మరిన్నీ విషయాలు బయటపడొచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉంటే నేటికీ గోండులు, మరియాలు, కదంబలు వంటి గిరిజన తెగల్లో ఇటువంటి సాంప్రదాయ సమాధి ఆచారాలు కొనసాగుతుండటం విశేషం.
Also Read: ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!