Indian Railways: ప్రయాణికులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన భారతీయ రైల్వేకు దిల్లీ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (Delhi Consumer Disputes Redressal Commission) గట్టి షాక్ ఇచ్చింది. ఆర్ఎసీ (RAC) టికెట్పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు (బంధువులు కారు) కలిపి ఒకే దుప్పటి, ఒకే దిండు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమేనని పేర్కొంటూ.. బాధితుడికి రూ. 25,000 పరిహారంతో పాటు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
2022 అక్టోబర్ 25న బాధిత వ్యక్తి.. ప్రయాగ్రాజ్ నుండి దిల్లీకి ప్రయాణించేందుకు ఏసీ కోచ్లో ఆర్ఎసీ టికెట్ బుక్ చేసుకున్నారు. అక్టోబర్ 28న ప్రయాణం సందర్భంగా అతనికి మరొక అపరిచిత వ్యక్తితో కలిపి ఒకే బెర్త్ కేటాయించారు. అయితే కోచ్ అటెండెంట్ వారిద్దరికీ కలిపి కేవలం ఒక దుప్పటి, ఒకే దిండు, రెండు బెడ్షీట్లు మాత్రమే ఇచ్చాడు. చలిలో ఒకే దుప్పటిని మరొక అపరిచిత వ్యక్తితో పంచుకోవడం కష్టంగా ఉందని వేరే దుప్పటి ఇవ్వాలని ప్రయాణికుడు ఎంత కోరినా అటెండెంట్ నిరాకరించాడు. ఒక సీటుకు ఒకే దుప్పటి ఇవ్వడం నియమమని సమాధానమిచ్చాడు.
సదరు ప్రయాణికుడు వెంటనే ఈ విషయంపై ట్విట్టర్ (ఎక్స్) ద్వారా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది కేవలం ఒక టవల్ మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. దీంతో టీటీఈని ఫిర్యాదు బుక్ (Complaint Book) అడిగినా ఇవ్వడానికి నిరాకరించారు. అనంతరం దిల్లీ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఆరు నెలల తర్వాత కేసును అలహాబాద్ డివిజన్కు పంపినట్లు మాత్రమే సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఆర్టీఐ (RTI) ద్వారా దరఖాస్తు చేసినా సరైన సమాధానం రాకపోవడంతో బాధితుడు మనోవేదనకు గురై వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన కమిషన్ ప్రెసిడెంట్ మోనికా అగర్వాల్ శ్రీవాస్తవ, సభ్యులు రాజేందర్ ధార్, రీతూ గరోడియాల ధర్మాసనం.. రైల్వే వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 2009లో ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఆర్ఎసీ ప్రయాణికులకు కూడా విడివిడిగా దుప్పటి, బెడ్షీట్ అందించాల్సిందేనని చెప్పింది. ఎందుకంటే వారి నుంచి బెడ్రోల్ ఛార్జీలు వసూలు చేస్తారని గుర్తుచేసింది. ఇద్దరు అపరిచితులకు ఒకే దుప్పటి ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని తేల్చిచెప్పింది.
అయితే సంబంధిత కాంట్రాక్టర్పై రూ. 1,000 జరిమానా విధించినట్లు రైల్వే అధికారులు చెప్పినప్పటికీ.. బాధితుడికి వేరే దుప్పటి ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని కమిషన్ పేర్కొంది. ప్రయాణికుడికి కలిగిన మానసిక వేదన, శారీరక ఇబ్బందులకు గానూ రూ. 20,000 పరిహారం, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5,000 మొత్తాన్ని 60 రోజుల్లోగా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గడువు దాటితే 7 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Also Read: విమానాలు లేవు.. కానీ నంబర్-1 ఎయిర్పోర్ట్.. ఖజురహోపై నెట్టింట ట్రోల్స్!
ఏసీ క్లాస్లలో (ఏసీ ఛైర్ కార్ మినహా) ప్రయాణించే ఆర్ఎసీ ప్రయాణికుల ఛార్జీల్లో రైల్వే అందించే దుప్పటికి కూడా రుసుము కలిసే ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు విడివిడిగా దుప్పటి పొందే హక్కు కచ్చితంగా ఉంటుందని రైల్వే నిపుణులు చెబుతున్నారు. ఈ సేవల్లో లోపం జరిగితే ప్రయాణికులు జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ నంబర్ 1915 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు.
Also Read: వాటర్ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్లు..బెస్ట్ సౌండ్ ఇచ్చే టాప్ 5 మోడల్స్!