Shimla Toy Train Cancelled: హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొండ ప్రాంతాల్లో మట్టి జారిపడటంతో రైలు మార్గాలు, రోడ్లు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా పొందిన కల్కా–షిమ్లా నారో గేజ్ రైల్వే లైన్పై టాయ్ ట్రైన్ సర్వీసులను రద్దు చేశారు.
సోలన్ జిల్లాలోని కోటి, గుమ్మన్ స్టేషన్ల మధ్య భారీగా మట్టి కొట్టుకుపోయింది. దీంతో రైల్వే ట్రాక్లో ఒక భాగం గాలిలో వేలాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితి ప్రయాణికుల భద్రతకు ప్రమాదకరంగా మారడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కోటి–గుమ్మన్ మధ్య బ్రిడ్జ్ నంబర్ 57 సమీపంలో ట్రాక్ చుట్టుపక్కల ఉన్న మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్ పరిస్థితిని పూర్తిగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాతే సేవలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ ఘటన కారణంగా ఆదివారం కల్కా నుంచి షిమ్లా, షిమ్లా నుంచి కల్కా మధ్య నడవాల్సిన మొత్తం 10 టాయ్ ట్రైన్ సర్వీసులను రద్దు చేశారు. ఈ విషయాన్ని షిమ్లా రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సంజయ్ గేవర్ వెల్లడించారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ నిర్ణయంతో నిరాశకు గురవుతున్నారు. సాధారణంగా వీకెండ్ లో పర్యాటకులతో సందడిగా కనిపించే షిమ్లా రైల్వే స్టేషన్.. రైళ్లు రద్దు కావడంతో ఆదివారం జనసంచారం లేకుండా నిశ్శబ్దంగా కనిపించింది.
కల్కా–షిమ్లా హెరిటేజ్ రైల్వే లైన్కు వర్షాకాలం పెద్ద సవాలుగా మారింది. భారీ వర్షాలు, మట్టి జారిపడటం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో ఈ మార్గంలో ఈ సీజన్లో పలుమార్లు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 96 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే మార్గం కొండ ప్రాంతాల్లోని క్లిష్టమైన పరిస్థితుల మధ్య నిర్మించారు. ఇందులో 102 సొరంగాలు, 800 వంతెనలు, 919 మలుపులు ఉన్నాయి. అందుకే ఈ మార్గాన్ని భారత రైల్వే ఇంజినీరింగ్లో ఓ అద్భుతంగా, అదే సమయంలో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా భావిస్తారు.
వర్షాల ప్రభావం రైలు మార్గానికే పరిమితం కాలేదు. ఆదివారం ఉదయం నాటికి హిమాచల్ప్రదేశ్లోని 64 రోడ్లను రాకపోకలకు మూసివేశారు. మండిలో అత్యధికంగా 24 రోడ్లు మూసివేయగా, కుల్లులో 16, కాంగ్రా, సిర్మౌర్ జిల్లాల్లో ఏడేసి రోడ్లు మూసివేశారు. ఉనాలో నాలుగు, షిమ్లాలో మూడు, చంబాలో రెండు, లాహౌల్–స్పితి జిల్లాలో ఒక రహదారి మూసివేశారు.
రాష్ట్రంలో వర్షాల పరిస్థితి ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని షిమ్లా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జూన్ 30న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ప్రదేశ్లో వర్షాలు, కొండచరియలు, ఇతర వర్ష సంబంధిత ఘటనల్లో సుమారు 103 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రానికి సుమారు రూ.1,184 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
Read Also: వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. ఈ రెండు రైళ్ల టైమింగ్స్ మారాయ్!