Historic Telangana Railway Station: తెలంగాణలో నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? ఒకప్పుడు కేవలం 6 కిలో మీటర్ల ప్రయాణంతో మొదలై.. ఇప్పుడు లక్షలాది మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా కనిపిస్తోంది. 150 ఏళ్లకు పైగా చరిత్రను కలిగింది. హైదరాబాద్ సంస్థానంలో రైల్వే ప్రయాణానికి పునాది వేసిన ఈ స్టేషన్ వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఏదంటే..
తెలుంగాణలో తొలి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీని నిర్మాణం 1874లో పూర్తయింది. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన కొనసాగుతున్న కాలంలో దీనిని నిర్మించారు. హైదరాబాద్ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలతో రైల్వే మార్గం ద్వారా కలపాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. 1870 ప్రాంతంలోనే రైల్వే మార్గానికి సంబంధించిన ప్రతిపాదనలు మొదలయ్యాయి. చివరకు 1874 అక్టోబర్ 8న సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైల్వే మార్గం ప్రారంభమైంది. ఈ మార్గం సుమారు 192 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది.
ఈ రైల్వే ప్రారంభోత్సవానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలి రోజున జరిగిన ప్రయాణం వాడి వరకు జరగలేదు. అప్పటి నిజాం, సాలార్ జంగ్ తో పాటు ఇతర ముఖ్య అధికారులు, సుమారు 150 మంది ప్రయాణికులు స్టీమ్ ఇంజన్ రైలులో సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి మిలిటరీ సైడింగ్ వరకు ప్రయాణించారు. ఆ దూరం కేవలం 6 కిలోమీటర్లే. కానీ, ఈ చిన్న ప్రయాణమే హైదరాబాద్ సంస్థాన రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం అప్పటి నిజాం శైలి, మొఘల్ వాస్తు కళల ప్రభావాన్ని ప్రతిబింబించేలా ఉండేది. పాత భవనం బయట నుంచి చూస్తే కోటను తలపించేలా కనిపించేది. నిజాం సొంత నిధులతో నిర్మించిన ఈ స్టేషన్, అప్పటి హైదరాబాద్ సంస్థాన అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. ఆ కాలంలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉండేవి. పర్దా పద్ధతిని అనుసరించే మహిళలు ఇతరులకు కనిపించకుండా రైలు ఎక్కడానికి, దిగడానికి ప్రత్యేకంగా ‘పర్దా వాల్’ ఏర్పాటు చేసినట్లు చెబుతారు.
సికింద్రాబాద్-వాడి రైల్వే మార్గం ప్రధాన వ్యాపార నగరాల గుండా కాకుండా తాండూర్, వికారాబాద్ లాంటి ప్రాంతాల మీదుగా వెళ్లింది. ఈ మార్గాన్ని బ్రిటీష్ సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు చరిత్ర చెబుతోంది. సైన్యాన్ని వేగంగా తరలించడానికి అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
హైదరాబాద్ సంస్థానంలో రైల్వే వ్యవస్థను విస్తరించేందుకు నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ఏర్పాటైంది. 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యే వరకు సికింద్రాబాద్ స్టేషనే ఈ రైల్వే వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా కొనసాగింది. తర్వాత 1951లో నిజాం రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వేలో విలీనం అయింది. కాలం మారినా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దీనిని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ తరహా సదుపాయాలు, మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలతో ఈ స్టేషన్ కొత్త రూపు దిద్దుకుంటోంది.
Read Also: ఈ రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ పక్క దేశానికి వెళ్లిపోవచ్చు!