500-Year-Old Tomb Mystery: పురాతన సమాధులు, రాజుల శవపేటికలు అనగానే ఎన్నో రహస్యాలు గుర్తుకొస్తాయి. వాటి చుట్టూ శాపాలు, దెయ్యాలు, అదృశ్య శక్తులకు సంబంధించిన కథలూ వినిపిస్తుంటాయి. అయితే, పోలాండ్లో జరిగిన ఓ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 500 ఏళ్ల నాటి ఓ రాజు సమాధిని పరిశోధనల కోసం తెరిచారు. అయితే, ఈ సమాధిని తెరిచిన వాళ్లంతా అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ రాజు శాపమే వారిని వెంటాడిందనే భయం మొదలైంది. కానీ, తర్వాత జరిగిన పరిశోధనలు అసలు కారణాన్ని బయటపెట్టాయి.
ఈ ఘటన 1973లో పోలాండ్లోని క్రాకోవ్ నగరంలో జరిగింది. అక్కడి ప్రసిద్ధ వావెల్ కేథడ్రల్లో పోలిష్ రాజు కాసిమిర్ IV జగీలాన్ సమాధి ఉంది. దాదాపు ఐదు శతాబ్దాలుగా మూసివున్న ఈ సమాధిని పురావస్తు, శాస్త్రీయ పరిశోధనల కోసం తెరవాలని నిర్ణయించారు. సమాధి తలుపులు తెరిచి పరిశోధకులు లోపలికి వెళ్లారు. అప్పట్లో అక్కడ ఉన్నవారికి ఇది ఒక సాధారణ పరిశోధనగా అనిపించింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
సమాధిలోకి వెళ్లిన పరిశోధకుల్లో కొందరికి అనారోగ్య లక్షణాలు కనిపించాయి. మొదట నలుగురు మరణించడంతో ఈ ఘటనపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత మరికొందరు కూడా ప్రాణాలు కోల్పోయారు. పరిశోధకులు, కార్మికులు సహా మొత్తం 15 మంది మరణించారు. దీంతో ప్రజల్లో భయం పెరిగింది. ఈజిప్టులో ఫరో తుతన్ ఖామున్ సమాధిని తెరిచిన తర్వాత జరిగిన మరణాల కథలు కూడా ప్రజలకు గుర్తుకొచ్చాయి.
వరుస మరణాలకు స్పష్టమైన కారణం వెంటనే తెలియకపోవడంతో, ఇది రాజు శాపం వల్లే జరిగిందనే ప్రచారం మొదలైంది. శతాబ్దాలుగా మూసివున్న సమాధిని తెరిచినందుకే ఈ పరిణామాలు ఎదురయ్యాయని చాలామంది నమ్మారు. అయితే, శాస్త్రవేత్తలు మాత్రం ఈ ఘటనకు అతీంద్రియ కారణాలను అంగీకరించలేదు. సమాధిలోని వాతావరణాన్ని పరిశీలించడం ప్రారంభించారు.
పరిశోధనల్లో సమాధిలో ప్రమాదకరమైన ఫంగస్ బీజాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఆస్పెర్గిల్లస్ ఫ్లేవస్ అనే ఫంగస్ అక్కడ పెరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. చాలా కాలం పాటు మూసివున్న ప్రదేశంలో పేరుకుపోయిన ఫంగస్ బీజాలు సమాధి తెరిచినప్పుడు గాలిలోకి వ్యాపించి ఉండొచ్చన్నారు. వాటిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రజలు భయపడినట్లుగా అది రాజు శాపం కాకపోవచ్చు. శతాబ్దాలుగా మూసివున్న సమాధిలో ఏర్పడిన సూక్ష్మజీవులే అసలు ప్రమాదానికి కారణమై ఉండవచ్చని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడించాయి. చాలా సంవత్సరాలుగా మూసివున్న సమాధులు, గుహలు, పాత భవనాల్లో ఫంగస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. వాటి బీజాలు గాలిలో కలిసినప్పుడు వాటిని పీల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రదేశాల్లోకి వెళ్లే సమయంలో పరిశోధకులు ప్రత్యేక మాస్కులు, రక్షణ దుస్తులు, ఇతర భద్రతా పరికరాలను ఉపయోగిస్తారు.
Read Also: ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక, ఇక్కడ సమాధులు కూడా కళాఖండాలే!