Zomato bans analogue dishes: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కస్టమర్ల ఆరోగ్యం, ఫుడ్ క్వాలిటీని దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. ప్లాట్ఫారమ్పై ‘అనలాగ్ డైరీ'(మ్యానిపులేటెడ్ లేదా సింథటిక్ పాలు/వెన్న సంబంధిత పదార్థాలు)వంటకాలను తక్షణమే నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలను పాటించని.. రెస్టారెంట్లను డెలివరీ లిస్ట్ నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది.మరో వైపు, కంపెనీలో భాగంగా హైదరాబాద్లో కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్స్ను నిలిపివేయడంతో 250 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు.
ఫుడ్ లవర్స్కు క్వాలిటీ, ఆరోగ్యకరమైన ఫుడ్ను అందించడమే లక్ష్యంగా జొమాటో నేడు దూసుకెళ్తోంది. ఇందులో.. భాగంగానే ప్లాట్ఫారమ్లో అమ్మే వంటకాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా జొమాటో తన యాప్లో ‘అనలాగ్ డైరీ వంటకాలపై ఉక్కుపాదం మోపింది. సాధారణ పాలు లేదా వెన్నకు బదులుగా కృత్రిమంగా తయారైన అనలాగ్ ఉత్పత్తులను వాడుతున్న రెస్టారెంట్లపై జీరో టాలరెన్స్ పాలసీని ప్రకటించింది. ఏయే రెస్టారెంట్లు.. అయితే ఈ అనలాగ్ పదార్థాలను ఉపయోగిస్తున్నామని ముందే డిక్లేర్ చేశాయో.. ఆ వంటకాలను వెంటనే తమ ప్లాట్ఫారమ్ నుంచి పూర్తిగా తొలగించినట్లు కంపెనీ వెల్లడించింది. కస్టమర్ల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జొమాటో పేర్కొంది.
ఈ తాజా నిబంధనల నేపథ్యంలో ..జొమాటో తన రెస్టారెంట్ భాగస్వాములకు కొన్ని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. రెస్టారెంట్లు తక్షణమే సహజసిద్ధమైన డైరీ ఉత్పత్తులకు మారాలని సూచించింది. ఒకవేళ వెంటనే మారడం సాధ్యం కాకపోతే.. ఆ అనలాగ్ డైరీ పదార్థాలతో తయారు చేసే వంటకాలను మెనూ నుంచి పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. సప్లయర్లు అందించే ఇంగ్రిడియంట్స్ లేబుల్స్ను క్షుణ్ణంగా పరిశీలించి, కస్టమర్లకు అందించే ఆహార వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని హెచ్చరించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రెస్టారెంట్ భాగస్వాములను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ప్లాట్ఫారమ్ నుంచి పూర్తిగా తొలగిస్తామని జొమాటో సీఈఓ ఆదిత్య మంగ్లా స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జొమాటో సీఈఓ ఆదిత్య మంగ్లా మాట్లాడుతూ.. “మా ప్రధాన ఉద్దేశం ఎక్కువ మందికి మంచి ఆహారాన్ని అందించడం. అంటే కస్టమర్ల ఆరోగ్యాన్ని రక్షించడం, మా భాగస్వాములు అందించే ఆహారంపై స్పష్టమైన ప్రమాణాలను పాటించడం. ఈ కొత్త పాలసీ మా నిబద్ధతను తెలియజేస్తుంది” అని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా.. కస్టమర్లకు మరింత ఆరోగ్యకరమైన ఫుడ్ అందించడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశమని కంపెనీ తెలిపింది. మార్కెట్లో ఆహార కల్తీని నివారించడానికి, కస్టమర్లకు తాము తింటున్న ఆహారంపై పూర్తి అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవైపు ఫుడ్ క్వాలిటీ విషయంలో కొత్త రూల్స్ తీసుకువస్తున్న జొమాటో, మరోవైపు అంతర్గత నిర్వహణలో భాగంగా భారీ మార్పులు చేస్తోంది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. జొమాటో తన కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్స్ను హైదరాబాద్లో నిలిపివేసింది. అంతే కాకుండా హైదరాబాద్లోని కార్యాలయంలో పని చేస్తున్న సుమారు 250 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. టెక్ రంగంలో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతుండటం ఉద్యోగులను కలవరపెడుతోంది.
Also Read: పిల్లలు తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతారు.. డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి?
జొమాటో తీసుకున్న ఈ రెండు కీలక నిర్ణయాలు ప్రస్తుతం ఫుడ్ టెక్ రంగంలో హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు కస్టమర్ల ఆరోగ్యం కోసం ఫుడ్ క్వాలిటీపై కఠిన నిబంధనలు తెస్తుండగా.. మరోవైపు బిజినెస్ మోడల్ను ఆప్టిమైజ్ చేసుకునే క్రమంలో ఉద్యోగాల తొలగింపు చర్యలు చేపడుతోంది. రాబోయే రోజుల్లో మిగతా ఫుడ్ డెలివరీ యాప్లు కూడా ఇలాంటి కఠినమైన ఫుడ్ సేఫ్టీ రూల్స్ను అనుసరించే అవకాశం ఉంది. కస్టమర్లు కూడా తాము ఆర్డర్ చేసే ఆహారంలో ఏం ఉంటుందనే దానిపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.