Kyrgystan: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. కిర్గిజ్స్థాన్ వేదికగా ఇరువురు నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో నేతల మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ జరిగినట్టు సమాచారం.
కిర్గిజ్స్థాన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ-ఎస్సిఓ 26వ సదస్సుకు హాజరయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ సదస్సుకు ముందు, ప్రధాన మంత్రి మోదీ బిష్కెక్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరువురు నేతలు వివిధ అంశాలపై ప్రధానంగా చర్చించారు. హోర్ముజ్ జలసంధి చుట్టూ సముద్ర పరిస్థితిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన నుంచి మోదీ-పెజెష్కియన్ల మధ్య జరిగిన తొలి సమావేశం ఇది.
ఇరాన్-అమెరికా సంఘర్షణ సమయంలో ఇద్దరు నాయకులు కేవలం టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. చివరిసారిగా జూన్ 30న నేతల మధ్య ఫోన్ కమ్యూనికేషన్ జరిగింది. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో మళ్లీ అంతరాయాలు తలెత్తాయి. ప్రపంచ వ్యాణిజ్యానికి జలమార్గం చాలా కీలకమైనది. ఈ మార్గంలో ఏవైనా దీర్ఘకాలిక అంతరాయాలు ఏర్పడితే చమురు సరఫరా, నౌకా రవాణా, భారత ఇంధన భద్రతపై గణనీయమైన పరిణామాలను కలిగిస్తాయి. ఇరాన్ పెజెష్కియన్ పశ్చిమాసియాలోని పరిణామాల గురించి ప్రధాని మోదీకి వివరించారు.
వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న వైఖరిని ప్రధాని పునరుద్ఘాటించారు. దీనికితోడు రవాణా అనుసంధానం, డిజిటల్ సహకారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సును అమెరికాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ హాజరైనట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా ఒత్తిడిని ఇరాన్ నాయకులు తోసిపుచ్చారు. యుద్ధాన్ని కోరుకోవడం లేదని, దురాక్రమణ జరిగితే తాము ప్రతిస్పందిస్తామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ అన్నారు.
ALSO READ: హర్మూజ్ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్, పేల్చిన అమెరికా