Rishikesh-Karnaprayag Railway: ఉత్తరాఖండ్ లో హిమాలయ పర్వతాల మధ్య నిర్మిస్తున్న రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టు ప్రణాళికలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 125 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ను 2029 నాటికి పూర్తిచేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు రూ. 17 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే భక్తులకు మరింత మేలు కలగనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా శివపురి–బయాసి సెక్షన్లో 2028 జూన్లో ట్రయల్ రన్లు ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే మిగిలిన పనులను పూర్తి చేసి 2029లో మొత్తం మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ వెళ్లాలంటే పర్వత రహదారులపై సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణం మరింత సులభంగా, వేగంగా మారనుంది.
ఈ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం సొరంగాలు. మొత్తం 125 కిలోమీటర్ల రైల్వే మార్గంలో దాదాపు 105 కిలోమీటర్లు సొరంగాల గుండా వెళ్తాయి. అంటే, రైల్వే లైన్లో సుమారు 85 శాతం భాగం భూగర్భంలోనే ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 16 సొరంగాలు, 35 ప్రధాన వంతెనలు నిర్మిస్తున్నారు. వీటిలో దేవప్రయాగ్–జనసు మధ్య నిర్మిస్తున్న సుమారు 14.58 కిలోమీటర్ల సొరంగం అత్యంత పొడవైనదిగా నిలవనుంది. హిమాలయ ప్రాంతంలో తరచూ కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సొరంగాల మార్గం వల్ల ఇలాంటి ప్రకృతి సమస్యల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ వెళ్లే రహదారి మార్గం సుమారు 173 కిలోమీటర్లు ఉంటుంది. కొత్త రైల్వే లైన్ పొడవు 125 కిలోమీటర్లు మాత్రమే. దీంతో ప్రయాణ దూరం దాదాపు 48 కిలోమీటర్లు తగ్గనుంది. ఈ మార్గంలో మొత్తం 12 కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి పర్వత ప్రాంత ప్రజలకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ఎంతో ఉపయోగపడనున్నాయి.
ఉత్తరాఖండ్కు ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు, పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి ఈ రైల్వే ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ నుంచి పర్వత ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సులు, కార్లపై ఆధారపడాల్సి ఉంటుంది. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే పర్వత ప్రాంతాల్లోకి ప్రయాణం మరింత సులభం కానుంది.
ఈ రైల్వే ప్రాజెక్టు కేవలం పర్యాటకం, ప్రయాణికుల కోసమే కాదు. భారత్–టిబెట్–చైనా సరిహద్దు ప్రాంతాలకు వ్యూహాత్మకంగా కూడా ఇది ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు. సైనిక సిబ్బంది, భారీ పరికరాలు, అవసరమైన సామాగ్రిని సరిహద్దు ప్రాంతాలకు వేగంగా తరలించేందుకు ఈ రైలు మార్గం ఉపయోగపడే అవకాశం ఉంది. అన్ని కాలాల్లోనూ రవాణాకు ఉపయోగపడే మౌలిక సదుపాయం ఏర్పడటం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో లాజిస్టిక్స్ మరింత బలోపేతం కానుంది.
Read Also: తెలంగాణలో తొలి రైలు ప్రారంభం ఇక్కడి నుంచే.. ఎన్ని కిలో మీటర్లు ప్రయాణించిందంటే?