Visakhapatnam Railway Station: దక్షిణ తీర రైల్వే (South Coast Railway) పరిధిలోని అత్యంత కీలకమైన విశాఖపట్నం రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కోచింగ్ యార్డ్ రీమోడలింగ్ కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ రూ.299 కోట్ల భారీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్టేషన్ నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెరగడమే కాకుండా, రైళ్ల సమయపాలన మెరుగుపడి ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో రోజువారీగా సగటున 80,000 మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తున్నారు. ప్రతీ రోజూ దాదాపు 113 రైళ్లు ఇక్కడి నుండి నడుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న యార్డ్ నిర్మాణం కారణంగా ఇక్కడికి వచ్చే, వెళ్లే రైళ్లు అనేక సర్ఫేస్ క్రాసింగ్లను దాటాల్సి వస్తోంది. దీనివల్ల అప్రోచ్ సిగ్నల్స్ వద్ద రైళ్లు నిలిచిపోవడం, ప్లాట్ఫారమ్లు ఖాళీ లేకపోవడం వంటి తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
యార్డ్ రీమోడలింగ్ ద్వారా సర్ఫేస్ క్రాసింగ్లను తగ్గించి రైళ్లు ఆగే సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 6 ప్లాట్ఫారమ్లను విస్తరించనున్నారు. అలాగే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు 6 కొత్త ప్లాట్ఫామ్లు, 6 అదనపు రైల్వే లైన్లను నిర్మిస్తారు. రైళ్ల రాకపోకలు సాఫీగా సాగేందుకు లూప్ లైన్లను తొలగించి యార్డ్ పాయింట్ జోన్లను పునర్వ్యవస్థీకరిస్తారు.
ఈ రీమోడలింగ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించనున్నారు. విస్తరించనున్న ప్లాట్ఫారమ్లపై ర్యాంప్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్టేషన్ తూర్పు వైపున (Eastern Side) కొత్త ప్రవేశ ద్వారాన్ని (Entrance) అభివృద్ధి చేయనున్నారు. రద్దీని తగ్గించేందుకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ను వేరే చోటికి తరలించనున్నారు. స్టేషన్ ప్రాంగణంలో వాహనాల రాకపోకలు సులువుగా ఉండేలా సర్ఫేస్ పార్కింగ్ వసతులు అమలు చేయనున్నారు.
Indian Railways has approved the remodelling of the Visakhapatnam coaching yard at an estimated cost of ₹299 crore.
The project includes the construction of six new platforms, the widening of the existing platforms, and a new entrance on the eastern side of the station.
Once… pic.twitter.com/Kz3XjtAeLO— TechChaitu (@techchaituu) July 31, 2026
Also Read: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్లోనే లైవ్ టీవీ!
విశాఖ రైల్వే స్టేషన్ లో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా యార్డ్లో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ (EI) సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొస్తారు. దీనివల్ల సిగ్నలింగ్ ప్రక్రియ మరింత ఫాస్ట్ గా మారి.. రైళ్ల రాకపోకలు మరింత సేఫ్ గా, వేగంగా మారుస్తాయి. మెుత్తంగా ఈ మౌలిక వసతుల పెంపుతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా, రైళ్లు ఆలస్యం కాకుండా సకాలంలో నడిచేలా రూపుదిద్దుకుంటుందని రైల్వే వర్గాలు తెలియజేస్తున్నాయి.
Also Read: పసిడి ప్రియులకు షాక్, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి?