Blood moon 2026: అప్పుడప్పుడూ ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని ఆసక్తిని రేకెత్తిస్తే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అలాంటి వాటిలో ఈ ఏడాదిలో సంభవించనున్న అరుదైన ఖగోళ సంఘటన సంపూర్ణ చంద్రగ్రహణం ఒకటి. ఈ క్రమంలో మార్చి 3న ఆకాశంలో అద్భుతం జరగబోతోందనే చెప్పాలి. విశ్వావసు నామ సంవత్సరంలో ఇదే చివరి గ్రహణం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు ఈ గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి ఎందుకు మారుతాడు? భారతదేశంలో ఈ దృశ్యం ఏ సమయంలో కనిపిస్తుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ముదురు ఎరుపు రంగులోకి మారడాన్ని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు దాని నీడ చంద్రుడిపై పడుతుంది. సూర్యకాంతి నేరుగా చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకున్నప్పటికీ, భూమి వాతావరణం వల్ల కొంత కాంతి చంద్రుడిపైకి చేరుతుంది. వాతావరణం నీలి రంగు కాంతిని ఫిల్టర్ చేసి, కేవలం ఎరుపు రంగు కాంతిని మాత్రమే చంద్రుడి వైపు వంచుతుంది. తద్వారా చంద్రుడు ఎర్రగా మెరుస్తూ కనిపిస్తాడు. ఒకవేళ ఆ సమయంలో మీరు చంద్రుడిపై నిలబడి భూమిని చూస్తే, భూమి చుట్టూ ఒక ఎర్రటి కాంతి వలయం కనిపిస్తుంది. అంటే.. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఒకేసారి చూస్తున్నట్లుగా ఆ అనుభూతి ఉంటుంది.
Also Read: మేడారం జాతరకు వెళ్తున్నారా? లగేజీ సర్దుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందే!
అమెరికా, పశ్చిమ యూరప్ దేశాల్లో ఈ సంపూర్ణ గ్రహణం పూర్తిగా కనిపిస్తుంది. అయితే, భారత్లో మాత్రం మనం గ్రహణం చివరి దశను మాత్రమే చూడగలం. మార్చి 3 సాయంత్రం మన దేశంలో చంద్రోదయం అయ్యే సమయానికే చంద్రుడు భూమి యొక్క దట్టమైన నీడ నుంచి బయటకు వచ్చేస్తుంటాడు. మనకు చంద్రుడు ఉదయించేటప్పుడు ఎర్రటి రంగులో కాకుండా, కాస్త మసకబారినట్లుగా కనిపిస్తాడు. దీనినే శాస్త్రవేత్తలు పెనంబ్రల్ దశ అని పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు తన సహజ రూపంలో కాకుండా కొంచెం మసకగా కనిపిస్తాడు.
ఈ చంద్ర గ్రహణం చూడాలంటే.. ఢిల్లీలో సాయంత్రం 6:18 గంటలకు, ముంబైలో 6:38 గంటలకు చంద్రోదయం అవుతుంది. అప్పటికే చంద్రుడు సంపూర్ణ గ్రహణ దశను దాటేసి ఉంటాడు. రాత్రి 9:23 గంటల వరకు ఈ ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు మళ్లీ తన సహజమైన కాంతిని పొందుతాడు. ఈ అద్భుతాన్ని చూడటానికి ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు లేదా ఫిల్టర్లు అవసరం లేదు. చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడటం వల్ల కళ్లకు ఎలాంటి హానీ జరగదు. తూర్పు దిక్కున నిలబడి ఆకాశం వైపు చూస్తే ఈ దృశ్యాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. అలాగే ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం మంచి అనుభూతిని ఇస్తుంది.
Also Read: నిచ్చెన కింద నిలబడితే బ్యాడ్ లక్? దాని కింద నడిస్తే.. అలా జరుగుతుందా, బాబోయ్!