College Harassment: స్వేచ్చ బ్యూరో: భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన లెక్చరర్లే ఆమె పాలిట యమభటులయ్యారు. ఎప్పుడో జరిగిన చిన్న పొరపాటును అడ్డం పెట్టుకుని నిత్యం వేధింపులకు గురి చేశారు. నానాటికీ ఈ హింస అధికమైపోవటంతో భరించలేక పోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నా చావు గురించి కాలేజీ వాళ్లకు తెలియ చేయకండి.. వాళ్లు సంతోషిస్తారంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదం మణికొండలో జరిగింది. మృతురాలి కుటుంబీకులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మణికొండ శ్రీరాంనగర్ కాలనీ వాస్తవ్యురాలైన శ్రేయ ఇబ్రహీంబాగ్లోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థిని. ఇదిలా ఉండగా మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో పరీక్షలకు హాజరైనపుడు పొరపాటున సెల్ ఫోన్ వెంటబెట్టుకుని వెళ్లింది. లెక్చరర్ జరిపిన తనిఖీలో మొబైల్ ఫోన్ బయట పడింది. తాను కావాలని సెల్ ఫోన్ తీసుకుని రాలేదని, పొరపాటున తెచ్చానని శ్రేయ ఫ్యాకల్టీని బతిమాలినా పట్టించుకోకుండా ఆమెను పరీక్షల నుంచి డీబార్ చేశారు. అయితే, ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. రెండో సంవత్సరం మొదలైనప్పటి నుంచి కాలేజీ లెక్చరర్లు ఆమెను లక్ష్యంగా చేసుకుని వేధించటం కొనసాగించారు. దీనిని తట్టుకోలేకపోయిన శ్రేయ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Also read: Sonam Bail: హనీమూన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?
ప్రాణాలు తీసుకోవటానికి ముందు శ్రేయ రాసిన సూసైడ్ నోట్ లోని అంశాలు ప్రతీ ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నీకు సిగ్గు..శరం లేదు..కొన్ని జీవితాలు ఎప్పటికీ మారవంటూ ఓ అధ్యాపకురాలు క్లాస్ లో అందరి ముందే దారుణంగా దూషించినట్టుగా పేర్కొంది. మరొకరేమో ఈసారి పరీక్షల్లో కూడా నువ్వే దొరుకుతావనుకుంటే వేరే వాళ్లు దొరికారంటూ సూటిపోటి మాటలతో వేధించినట్టుగా రాసింది. మూడు నెలలుగా సాగుతున్న ఈ హింసను భరించలేకనే ప్రాణాలు తీసుకుంటున్నట్టుగా పేర్కొంది. అమ్మా..నాన్న నన్ను క్షమించండి..నేను చనిపోతున్నా..కాలేజీలో వేధింపులు భరించలేక పోతున్నా అని పేర్కొంది. నా చావు గురించి కాలేజీ వాళ్లకు తెలియనివ్వకండి..వాళ్లు బాధపడరు..పైగా సంతోషిస్తారని పేర్కొంది.
జరిగిన ఈ విషాదంపై నార్సింగి పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రేయ ఇంటికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆమె రాసి పెట్టిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వివరాల ఆధారంగా విచారణ సాగిస్తున్నారు. తమ కూతురు పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఎన్నో కలలు కన్నామని శ్రేయ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతురి ఆత్మహత్యకు కారణమైన కాలేజీ అధ్యాపకులు, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also read: Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!