Vakiti Srihari: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్లో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తూ.. బీఆర్ఎస్ నాయకత్వ తీరుపై ఘాటైన విమర్శలు గుప్పించారు.
‘మాది స్వాతంత్ర్యం తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన జాతి’
తమది దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడమే కాకుండా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప చరిత్ర కలిగిన జాతి అని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు. ఇచ్చిన తెలంగాణను అందరూ మెచ్చేలా తీర్చిదిద్దుతున్నామని, ప్రజలకు ఎల్లప్పుడూ విశ్వాసంగా ఉంటూ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నామని అన్నారు. గతంలో తెలంగాణను దోచుకున్న రాబందులను తరిమికొట్టడమే కాకుండా, భవిష్యత్తు తరాలకు బాసటగా నిలిచామని ఆయన పేర్కొన్నారు.
కేటీఆర్కు గట్టి కౌంటర్
మరోవైపు కేటీఆర్పై విమర్శలు చేస్తూ.. ఎక్కుపెట్టిన తుపాకీకి ఎదురుగా నిలబడిన ఉద్యమకారుల వెనుక దాక్కున్న పిరికిపందల చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని దుయ్యబట్టారు. రాష్ట్ర సాధన కోసం నిలువెల్లా కాలిపోయిన విద్యార్థుల చితిమంటల మీద చలికాచుకున్నది ఎవరో తెలంగాణ సమాజానికి బాగా తెలుసని గుర్తుచేశారు. అమరవీరుల సమాధులపై గడీలు కట్టుకున్న నికృష్టపు చరిత్ర బీఆర్ఎస్దేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘అహంకారమే చెత్తకుప్పలో పడేసింది’
తెలంగాణ యువకుల బలిదానాల మీద కూర్చొని పంచభక్ష్య పరమాన్నాలు తిన్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాన్ని, తెలంగాణ సంపదను అనకొండలా అమాంతం మింగేశారని విమర్శించారు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలపై అహంకారం చూపించినందుకే, తెలంగాణ ప్రజల చైతన్యం ముందు ఓడిపోయి చెత్తకుప్పలో పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ నిజాన్ని కేటీఆర్ ఎప్పటికీ మరచిపోవద్దని మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. హైదరాబాద్కు చెందిన ముగ్గురు మృతి!