Innova Hycross Price Set to Drop: ఇన్నోవా కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి టయోటా ఆటో మోబైల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ MPV ధరలో సుమారు రూ. 1.5 లక్షల వరకు తగ్గించబోతోంది. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఈవీ పాలసీ 2.0. భారత్ లో ఇన్నోవా చాలా కాలంగా మంచి ప్రజాదరణ పొందింది. కుటుంబ ప్రయాణాలు, కమర్షియల్ ఉపయోగాలతో పాటు అన్ని అవసరాలకు మంచి ఆప్షన్ కావడంతో ఎక్కువ మంది ఈ కారును ఇష్టపడుతున్నారు.
హైబ్రిడ్ వాహనాలకు 50 శాతం రాయితీ
ఢిల్లీ ప్రభుత్వం తీసుకురానున్న కొత్త ఈవీ పాలసీ ప్రకారం, 2030 వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో పూర్తిగా మినహాయింపు ఉంటుంది. ఇదే సమయంలో, హైబ్రిడ్ వాహనాలకు కూడా 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని భావిస్తోంది. ఇది ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు హైబ్రిడ్ వాహనాలపై కూడా సాధారణ పెట్రోల్ వాహనాల మాదిరిగానే పన్నులు విధిస్తున్నారు.
రూ. 30 లక్షల్లోపు హైబ్రిడ్ వాహనాలకు మాత్రమే!
ఈ రాయితీ రూ. 30 లక్షల లోపు ధర ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలకు వర్తించనుంది. దీని వల్ల ఇన్నోవా హైక్రాస్ VX, VX(O) వేరియంట్లు కొనుగోలుదారులకు మరింత అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఈ వేరియంట్లపై ఢిల్లీలో రిజిస్ట్రేషన్ ఖర్చు సుమారు రూ. 2.85 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. కొత్త పాలసీ అమల్లోకి వస్తే, ఈ ఖర్చు సగానికి తగ్గి, కొనుగోలుదారులు సుమారు రూ. 1.4 లక్షల నుండి రూ. 1.5 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే ప్రయోజనం ఇతర హైబ్రిడ్ వాహనాలకూ వర్తించనుంది. మారుతి ఇన్విక్టో, టయోటా హైరైడర్, గ్రాండ్ విటారా లాంటి మోడళ్లను కొనుగోలు చేసే వారు కూడా రిజిస్ట్రేషన్ ఫీజుల్లో భారీ తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. దీని వల్ల హైబ్రిడ్ వాహనాలపై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది.
పెట్రో వాహనాలతో పోల్చితే మెరుగైన మైలేజ్
ఇంధన వినియోగం విషయానికి వస్తే, హైబ్రిడ్ వాహనాలు సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే మెరుగైన మైలేజీని అందిస్తాయి. సాధారణంగా కనీసం 4-5 కిలోమీటర్ల వరకు అదనపు మైలేజీ లభిస్తుంది. సుదూర ప్రయాణాల్లో ఫ్యూయెల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. మొత్తంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చే ఈ కొత్త విధానం వల్ల ఇన్నోవా లాంటి హైబ్రిడ్ వాహనాలు మరింత చౌకగా, ఆకర్షణీయంగా మారనున్నాయి. ధరలో తగ్గుదలతో పాటు ఇంధన ఆదా కూడా కలిసి వస్తుండటంతో, కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్ గా మారనుంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, హైబ్రిడ్ వాహనాల వినియోగం దేశ వ్యాప్తంగా మరింత పెరిగే అవకాశముంది.
Read Also: లీటర్కు 45 కిమీ మైలేజీ.. ఆటో మోబైల్ ఇండస్ట్రీలో కొత్త కారు సంచలనం!