LPG Surcharge: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చమురు నౌకలు జలసంధి వద్ద ఉండిపోవడంతో వివిధ దేశాల్లో గ్యాస్ కొరత వెంటాడుతోంది. ఈ క్రమంలో రెస్టారెంట్లకు వెళ్లిన వినియోగదారులకు బాదుడు మొదలైంది. ఇచ్చే బిల్లులో గ్యాస్ పేరిట అదనపు ఛార్జీ వడ్డిస్తున్నాయి. విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం.
గ్యాస్ కొరత.. రెస్టారెంట్లలో కొత్త రకం బాదుడు
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దాని ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడుతోంది. మంచి నీటి బాటిళ్లు మొదలు రెస్టారెంట్ల వరకు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు ఉంది. యుద్ధానికి ముందు దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి. ఎల్పీజీ కొరత ఉండడంతో చాలామంది రెస్టారెంట్లు వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడా వినియోగదారులపై బాదేస్తున్నాయి. వందకు 10 రూపాయల చొప్పున వడ్డన మొదలయ్యాయి కొన్ని రెస్టారెంట్లు.
పైన కనిపించిన రసీదులో ఉన్న వివరాల మేరకు.. చెన్నైకి చెందిన ఓ రెస్టారెంట్ నుండి వినియోగదారుడికి ఓ బిల్లు వచ్చింది. అందులో ఇడ్లీకి 33 రూపాయాలు, వడకు మరో 33 రూపాయాలు వచ్చింది బిల్లు వేసింది. చివరలో గ్యాస్ పేరిట అదనపుగా రూ. 9.50 పైసలు వడ్డించింది. దీనికితోడు రెండురకాల జీఎస్టీ కూడా వడ్డించింది. దీనికి సంబంధించి బిల్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
బిల్లులో గ్యాస్కు అదనపు ఛార్జ్ వసూలు
ఆ బిల్లు చూసి సామాన్యుడు షాకవుతున్నాడు. కేవలం చెన్నైలో మాత్రమేకాదు బెంగుళూరులో కూడా కస్టమర్లపై ఇలాంటి వడ్డన మొదలైందని అంటున్నారు. కొన్ని రెస్టారెంట్లు అయితే సర్ఛార్జీలకు బదులుగా మెనూ ధరలను సవరించాలని భావిస్తున్నాయి. ఇటీవల బెంగుళూరులోని ఓ రెస్టారెంట్లో LPG కొరత, వాణిజ్య సిలిండర్ల ధరల పెంపు పేరుతో రూ.5 నుండి రూ.10 వరకు పెంచింది.
కొన్ని రెస్టారెంట్లు బిల్లులతో కలిపి వేస్తుంటే, మరికొందరు గ్యాస్ పేరిట వడ్డన మొదలుపెట్టారు. ఇటీవల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను పెంచింది కేంద్రం. 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర నెల కిందటి వరకు దాదాపు రూ.1,650 వరకు లభించేది. ప్రస్తుతం రూ. 2,100 నుంచి రూ. 2300 వరకు ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల ప్రత్యేకంగా ఛార్జీలు వేయాల్సి వస్తుందని చెబుతున్నాయి.
ALSO READ: ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ, అసలే ఎండాకాలం
వైరల్ అవుతున్న రెస్టారెంట్ బిల్లుపై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ తరహా వడ్డన ఒకసారి మొదలైతే అది ఎప్పటికీ ఆగదని అంటున్నారు. గతంలో వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గించినప్పుడు అప్పుడు ధరలు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ప్రతీది వినియోగదారులపై వడ్డించేందుకు ప్రభుత్వాలతోపాటు చివరకు రెస్టారెంట్లు సైతం సిద్దమయ్యాయని చెప్పవచ్చు.