Indian Currency: మన జీవితంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతిరోజూ ఏదో ఒక అవసరం కోసం మనం డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మన దేశంలో వివిధ రంగుల కాగితాలను కరెన్సీగా ఉపయోగిస్తున్నాము. ఈ కరెన్సీని చలామణిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకుంటుంది. అయితే, ఈ కరెన్సీ తయారీకి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో చాలా తక్కువ మందికే తెలుసు. ఈ నేపథ్యంలో కరెన్సీ నోట్ల ముద్రకు కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చుపెడుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా విడుదల చేసిన RBI రిపోర్ట్ ప్రకారం.. కరెన్సీ నోట్స్ ప్రింటింగ్కు ఖర్చు వేర్వేరుగా ఉంటుంది. రూ.10 నోటు తయారీకి 96 పైసలు ఖర్చు అవుతుంటే.. రూ.20 నోటుకు 95 పైసలు ఖర్చవుతుంది. అదే విధంగా, రూ.50 నోటుకు రూ.1.75 పైసలు, రూ.100 నోటుకు రూ.1.77 పైసలు, రూ.200 నోటుకు రూ.2.37 పైసలు ఖర్చవుతాయి. రూ.500 నోటుకు రూ.2.29 పైసలు ఖర్చు అవుతుండగా.. ప్రస్తుతం చలామణిలో లేని రూ.2000 నోటు తయారీకి రూ.3.54 పైసలు ఖర్చవుతుంది.
2024-25 సంవత్సరంలో కరెన్సీ నోట్స్ ప్రింటింగ్ కోసం RBI దాదాపు రూ.6372 కోట్లు ఖర్చు చేసింది. ఫేక్ కరెన్సీని అడ్డుకునేందుకు హై సెక్యూరిటీ ఫీచర్స్ను నోట్ల తయారీలో ఉపయోగిస్తారు. వాటర్ మార్క్, మైక్రో లెటరింగ్, సెక్యూరిటీ త్రెడ్, కలర్ షిఫ్టింగ్, ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వంటి భద్రతా ఫీచర్స్ ఇందులో భాగం. నిజానికి, ప్రింటింగ్ ప్రాసెస్లో ఈ ఫీచర్స్కే ఎక్కువ ఖర్చు అవుతుంది.
భారత్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లలో ఈ కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తున్నారు. మొత్తం సర్క్యులేషన్లో రూ.500 నోట్లు దాదాపు 40 శాతం ఉన్నాయి. అయితే, మొత్తం కరెన్సీ వాల్యూలో ఇవి 80 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి.