RBI Plan: దేశంలో కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్బిఐ పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావడానికి అంతా రెడీ చేసింది. దీన్ని ఓ పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు జోరుగా సాగుతున్నాయి.
ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయోచ్-ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్బిఐ. త్వరలో పాలిమర్ నోట్లకు సంబంధించి తొలి పైలట్ విడతను ప్రారంభించనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ తొలుత రూ.10, రూ.20 వంటి చిన్న విలువ గల నోట్లతో ప్రారంభం కావచ్చని సమాచారం.
వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి-ఫలితాల ఆధారంగా 2027 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ఆర్బిఐ అడుగులు వేస్తుందని వర్గాలు అందులోని సారాంశం. దీనిపై అభిప్రాయాలను సేకరించి అప్పుడు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. పాలిమర్ నోట్లు వచ్చినప్పటికీ పేపర్ కరెన్సీ ఎప్పటి మాదిరిగా కొనసాగుతుందని ఆయా వర్గాలు చెబుతున్నారు. ఈ లెక్కన దశలవారీగా పాలిమర్ నోట్లు మార్కెట్లోకి రానున్నాయి.
టెండర్లకు ఆహ్వానం-పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కొద్దిరోజుల కిందట వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. కొత్త తరహా కరెన్సీ నోట్లను ముద్రించడానికి ప్రత్యేకమైన పదార్థం పాలిమర్ సబ్స్ట్రేట్ షీట్ల తయారీ, సరఫరా కోసం ఆర్బీఐ నోట్ల ప్రింటింగ్ విభాగం గ్లోబల్ టెండర్ను జారీ చేసిందని తెలుస్తోంది. ఈఓఐ కింద బిడ్లను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 18 వరకు నిర్ణయించినట్లు సమాచారం.
తొలుత చిన్న నోట్లు చెలామణి-కాగితపు కరెన్సీ కంటే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ మన్నికైనవి. ఎక్కువ కాలం చెలామణిలో ఉంటాయి. ప్రస్తుతం నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లను ముద్రించడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి మన్నిక ఎక్కువకాలం ఉంటుంది. పదేపదే ముద్రించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల కాలక్రమేణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
నకిలీ నోట్లను అరికట్టడం, కరెన్సీ నోట్ల మన్నికను పెంచడం ఈ పాలిమర్ నోట్ల ముఖ్య ఉద్దేశం. ఇవి తడిని తట్టుకోగలవు. చిరిగి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఉండవు. ఆర్బిఐ పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం మొదటిసారి కాదు.
ALSO READ: పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలలో పాలిమర్ నోట్లు చలామణిలో ఉన్నాయి. తొలి మొదట ఆస్ట్రేలియాలో ఈ తరహా నోట్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కెనడా, యూకె, సింగపూర్, న్యూజిలాండ్, మలేషియా, థాయ్లాండ్, రొమేనియా, బ్రూనైలలో ప్రవేశపెట్టారు. తాజాగా భారతదేశంలో వాటిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ లెక్కన మరోసారి నోట్ల రద్దు ఉండే అవకాశం ఉందనే వాదనలు లేకపోలేదు. ప్లాస్టిక్ నోట్లు రాగానే పాత నోట్లను ఆర్బీఐ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 2027 చివర లేకుంటే 2028 లో పాత నోట్ల రద్దు ఉండే అవకాశముందని అప్పుడే ప్రచారం మొదలైపోయింది.