ME Card Scheme: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో కొన్ని పథకాల లబ్ధిదారులకు క్రెడిట్ కార్డ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ పరిమితి దాదాపు రూ. 5 లక్షల వరకు ఉంటుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ప్రయోజనాలు ఏంటి? ఎవరు పొందుతున్నారు? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
మోదీ ప్రభుత్వం లబ్ధిదారులకు క్రెడిట్ కార్డును అందించే కొన్ని పథకాలు కలిగి ఉన్నాయి. అలాంటి వాటిలో సూక్ష్మ పరిశ్రమల కోసం ప్రవేశ పెట్టిన పథకం ఒకటి. ఈ పథకం కింద ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు పరిమితితో క్రెడిట్ కార్డులను అందిస్తుంది. చిన్న వ్యాపారాల నిర్వహణ మూలధనాన్ని సులభంగా పొందవచ్చు. అంతేకాదు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. మైక్రో క్రెడిట్ కార్డ్ పథకం ప్రయోజనాలను పొందాలంటే ఏం చేయ్యాలి? సూక్ష్మ సంస్థలు ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. కార్డు జారీ చేయడం, రుణ పరిమితిని నిర్ణయించడంపై తుది నిర్ణయం బ్యాంకులదే. ఈ నిర్ణయం క్రెడిట్ తనిఖీ, దాని విధానం ఆధారంగా తీసుకుంటాయి బ్యాంకులు. ప్రతి క్రెడిట్ కార్డ్ రూ. 5 లక్షల వరకు ఆమోదించబడిన రివాల్వింగ్ క్రెడిట్ పరిమితితో వస్తుంది. దరఖాస్తుదారులకు ఎలాంటి రుసుము లేదు.
వార్షిక రుసుము కార్డ్ పరిమితిలో 1 శాతం లేదా రూ. 1000, ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానికి పరిమితం కావచ్చు. కాగితపు పని లేకుండా ఆమోదం కోసం UPI, అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్, కామన్ డిజిటల్ అప్లికేషన్ ఫారం ఉపయోగించబడతాయి. వడ్డీ రేట్లు RBI మార్గదర్శకాల ప్రకారం నిర్ణయించబడతాయి. లబ్దిదారులు తమ వ్యాపారాల నిర్వహణ మూలధన అవసరాలను తీర్చుకోవడానికి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. షాపు లేదా యూనిట్ కోసం ముడి పదార్థాలను కొనుగోలు చేయడం, స్టాక్ను పెంచుకోవడం, రోజువారీ వ్యాపార ఖర్చులను తీర్చడం, తాత్కాలిక నగదు కొరతను తీర్చడం వంటి వాటికి ఉపయోగించవచ్చు. సాధారణ టర్మ్ లోన్ కంటే భిన్నమైనది. రివాల్వింగ్ క్రెడిట్ వ్యాపారాలకు ఆమోదించబడిన పరిమితిలో నిధులను అవసరమైనప్పుడు అనుమతిస్తుంది. చెల్లింపు తర్వాత అందుబాటులో ఉన్న క్రెడిట్ను తిరిగి ఉపయోగించుకోవచ్చు.
ALSO READ: డిగ్రీ లేకపోయినా రూ.1 లక్షకు పైగా జీతం.. ఎలా సంపాదిస్తున్నాడంటే
2025 ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025-26లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ. 5 లక్షల వరకు పరిమితితో కూడిన క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. తొలి ఏడాది 10 లక్షల కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం ఓ మార్పు చేసింది. చిన్న తరహా సంస్థల విభాగంలో పెట్టుబడి పరిమితిని కోటి నుండి రూ. 2.5 కోట్లకు పెంచింది. టర్నోవర్ పరిమితిని రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్లకు పెంచింది. చిన్న తరహా సంస్థలకు ఈ పరిమితులను రూ. 25 కోట్లు, రూ. 100 కోట్లకు పెంచారు. మధ్య తరహా సంస్థలకు పరిమితులను రూ. 125 కోట్లు మరియు రూ. 500 కోట్లకు పెంచిన విషయం తెల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఏమైనా చిన్న వ్యాపారం చేస్తున్నారా? మోదీ ప్రభుత్వం ఇస్తున్న క్రెడిట్ కార్డు తీసుకుని అడుగులు వేయండి.