Food Safety: ప్యాకేజ్డ్ ఫుడ్స్, డ్రింక్స్లో అధికంగా ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వు గురించి వినియోగదారులకు స్పష్టంగా తెలియజేసేందుకు భారత్ కీలక అడుగు వేస్తోంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాక్ ముందు భాగంలో ప్రత్యేక హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నిర్ణయం దేశంలోని భారీ ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
FSSAI ప్రతిపాదన ప్రకారం.. ఒక ఉత్పత్తిలో కొవ్వు, చక్కెర, ఉప్పు వంటి పోషకాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలు ఎక్కువగా ఉంటే ప్యాక్పై ఎరుపు రంగు హెక్సాగన్ ఆకారంలో హెచ్చరిక లేబుల్ ఉండనుంది. ఇందులో HIGH FAT, HIGH SUGAR, HIGH SALT వంటి వివరాలు స్పష్టంగా కనిపించేలా ముద్రించనున్నారు.
కొనుగోలు చేసే సమయంలో ఉత్పత్తిలో ఏ పోషకం అధికంగా ఉందో వినియోగదారులు వెంటనే గుర్తించడమే ఈ లేబుల్స్ ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా పిల్లలు, ఇతర సున్నిత వర్గాల వారు అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా నిర్ణయం తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని FSSAI పేర్కొంది.
Also Read: ఇంటర్నెట్ లేకుండా 4G ఫోన్.. పిల్లల కోసం HMD తీసుకొచ్చిన స్కూల్ ఎడిషన్ ఇదే!
భారత్లో భారీగా ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్, బెవరేజ్ పరిశ్రమకు ఈ ప్రతిపాదన పెద్ద సవాలుగా మారనుంది. కోకకోలా, నెస్ట్లే, పెప్సికో వంటి కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే పరిశ్రమ వర్గాలు గతంలో ఇలాంటి లేబుల్స్ వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తాయని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు వల్ల ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలు చాలాకాలంగా హెచ్చరిక లేబుల్స్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో FSSAI తాజా ప్రతిపాదనను సమర్పించింది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్స్పై ఈ కొత్త లేబుల్స్ ఎప్పుడు అమల్లోకి వస్తాయన్నది స్పష్టమవుతుంది.
Also Read: బడ్జెట్లో చూడగానే నచ్చేసే టెక్నో కొత్త ఫోన్.. 120Hz డిస్ప్లే, AI ఫీచర్లతో లాంచ్!