Amsterdam Island Cows: దక్షిణ హిందూ మహాసముద్రంలోని అతి చిన్న అగ్నిపర్వత ద్వీపం ‘యామ్స్టర్డామ్’ (Amsterdam Island). అక్కడ 1871లో చోటుచేసుకున్న ఓ ఘటన.. ప్రస్తుత శాస్త్రవేత్తలకు అంతుపట్టని రహస్యంగా మారిపోయింది. ఆ కాలంలో హ్యుర్టిన్ అనే రైతు ఐదు ఆవులతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో మునుషులు లేని ఆ ద్వీపంలో కాలుమోపాడు. అక్కడి కఠిన వాతావరణ పరిస్థితుల కారణంగా అతని ప్రయత్నం కొన్ని నెలలకే విఫలమైంది. దాంతో అతను ఆ దీవిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ ఐదు ఆవులను మాత్రం అక్కడే వదిలేశాడు. అక్కడ మొదలైన కథ.. జీవశాస్త్ర ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన సర్వైవల్ మిస్టరీగా మారుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు.
హ్యుర్టిన్ అనే రైతు తాను వదిలేసిన ఆవులు.. కొద్ది రోజులకే చనిపోయి ఉంటాయని భావించాడు. కానీ ఆ ఐదు ఆవులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. సుడిగాలులు, పరిమిత మంచినీరు, శీతల వాతావరణం తట్టుకుంటూ ప్రకృతికి ఎదురీది బతికాయి. కేవలం బతకడమే కాదు, రానురానూ వాటి సంఖ్య పెరిగి ఏకంగా 2,000 ఆవుల భారీ గుంపుగా మారింది. అంత చిన్న సంఖ్యతో ఆరంభమై దాదాపు 130 ఏళ్లకు పైగా జన్యుపరమైన క్షీణత (Inbreeding collapse), వ్యాధుల బారిన పడకుండా ఆ ఆవులు ఎలా మనగలిగాయో అర్థం కాక దశాబ్దాల పాటు శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు.
ఈ విచిత్రానికి సమాధానం కనుగొనడానికి INRAE జన్యుశాస్త్రవేత్త మాథ్యూ గోటియర్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం 2024లో పరిశోధనలు చేపట్టింది. ఈ గుంపు నశించిపోకముందు (2010కి ముందు) సేకరించిన 18 ఆవుల DNA నమూనాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు కనుగొన్న విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ ఆవులు కేవలం ఒక్క జాతికి చెందినవి కావని.. వాటిలో 75% యూరోపియన్ (జెర్సీ) జాతి జన్యువులు, 25% మడగాస్కర్ పరిసర ప్రాంతాలకు చెందిన ఇండియన్ ఓషన్ ‘జెబు’ (Zebu) జాతి జన్యువులు ఉన్నాయని తేలింది. ఈ జన్యు వైవిధ్యమే (Genetic Diversity) అవి కఠిన పరిస్థితులను తట్టుకోవడానికి ప్రధాన కారణంగా నిలిచాయని తేలింది.
యూరోపియన్ జాతికి చెందిన ఆ ఆవుల పూర్వీకులు.. చల్లని, వేగవంతమైన గాలులను తట్టుకొని జీవించాయి. దీంతో ఆ ఆవుల్లో సహజసిద్దంగా ఉన్న వాటి పూర్వీకుల డీఎన్ఏ.. యామ్స్టర్డామ్ దీవిలోని కఠిన వాతావరణాన్ని తట్టుకునేందుకు సహాయపడ్డాయి. అయితే సాధారణంగా ఐదు జంతువులతోనే వంశపారపర్యాన్ని కొనసాగిస్తే తీవ్రమైన జన్యు లోపాలు (Inbreeding) వచ్చి ఆ జాతి అంతరించిపోతుంది. ఈ ఆవులలో కూడా ఇన్-బ్రీడింగ్ స్థాయి 30% వరకు ఉంది. అయినప్పటికీ ఆరంభంలోనే ఇవి చాలా వేగంగా సంతానోత్పత్తి చేయడంతో జన్యు క్షీణత ముప్పు నుంచి తప్పించుకున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ ఆవులు శారీరక రూపాంతరం కంటే ముందుగా తమ ప్రవర్తనను (Behavioral Adaptation) మార్చుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాటి నాడీ వ్యవస్థ, ప్రవర్తనకు సంబంధించిన జన్యువులలో వేగవంతమైన పరిణామాలు జరిగినట్లు గుర్తించారు. దీనివల్ల ఆ ఆవులు చాలా వేగంగా అడవి జంతువులుగా రూపాంతరం చెంది.. తమను తాము రక్షించుకునే లక్షణాలను అలవరుచుకున్నాయని పేర్కొన్నారు.
Also Read: అమెరికా To బ్రిటన్.. భారతీయులు ఎక్కువగా ఉన్న టాప్ – 7 దేశాలు.. లెక్కలు చూస్తే షాకే!
యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన.. ఈ ఆవుల మందకు ఎండ్ కార్డ్ పడింది. ఆ ద్వీపంలో వీటి జీవన పోరాటానికి 2010లో అధికారులు ముగింపు పలికారు. యామ్స్టర్డామ్ ద్వీపంలోని అరుదైన స్థానిక వృక్షసంపదను, అక్కడ మాత్రమే కనిపించే ‘యామ్స్టర్డామ్ ఆల్బట్రాస్’ పక్షులను కాపాడేందుకు పర్యావరణ అధికారులు ఈ ఆవుల గుంపును పూర్తిగా తొలగించారు. వాటిని మరో ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ఆ ద్వీపాన్ని యూనిస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ద్వీపం నుండి ఆవులు తుడిచిపెట్టుకుపోయినా వాటి DNA రూపంలో ఆ చరిత్ర ఇప్పటికీ సజీవంగానే ఉంది. 1871లో ఐదు ఆవులతో అనుకోకుండా మొదలైన వాటి ప్రస్థానం.. ప్రకృతిలో జీవుల ఆశ్చర్యకరమైన మనుగడ సాగించే శక్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
Also Read: నడవలేము మహాప్రభో.. ప్రపంచ ‘బద్దకస్తుల’ జాబితాలో.. భారత్ స్థానం ఎంతంటే?