Substandard Products In India| కొన్ని గ్లోబర్ కంపెనీలు అమెరికా, యూరోప్తో మంచి క్వాలిటీ ఉత్పత్తులు విక్రయిస్తుండగా.. అదే బ్రాండ్ పేరుతో భారతదేశంలో తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఆ ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం ప్రజలు సాధారణంగా వినియోగిస్తున్నవి కావడంతో ఆరోగ్యపరంగా ఇది ఆందోళనకర విషయమని నిపుణలు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పేరున్న విదేశీ ఫుడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రతి దేశంలో ఒకే విధంగా తయారు చేయకపోవచ్చు. స్థానిక చట్టాలు, రుచులు, ధరలు, ముడి పదార్థాల లభ్యత వంటి కారణాలతో పదార్థాల్లో మార్పులు చేస్తుంటాయి. అయితే, భారత్లో విక్రయించే కొన్ని ఉత్పత్తుల పదార్థాలపై ఇటీవల చర్చ పెరిగింది. అందుకే ప్రతి ఉత్పత్తి భద్రత, నాణ్యతను ప్రస్తుత లేబుల్స్, అధికారిక సమాచారం ఆధారంగా పరిశీలించాలి.
నెస్లేకు చెందిన సెరిలాక్ ఉత్పత్తులలో చక్కెర వినియోగంపై గతంలో వివాదం జరిగింది. కొన్ని దేశాల్లో లభించే ఉత్పత్తులతో భారతీయ సెరిలాక్ను పోల్చుతూ నివేదికలు వెలువడ్డాయి. భారత్లో విక్రయించే కొన్ని సెరిలాక్ ఉత్పత్తుల్లో అదనపు చక్కెర ఉందని నివేదిక పేర్కొంది. అయితే నెస్లే భారతీయ ఉత్పత్తులు వర్తించే నిబంధనలను పాటిస్తున్నాయని తెలిపింది. తర్వాత భారత్లో కొన్ని రిఫైన్డ్ షుగర్ లేని సెరిలాక్ వేరియంట్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.
భారత్లో విక్రయించే మ్యాగీ 2 మినిట్ మసాలా నూడుల్స్లో నూడిల్ కేక్, మసాలాలో పామ్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. కానీ యుకె దేశంలోని కొన్ని మ్యాగి ఫార్ములేషన్లలో సన్ఫ్లవర్ ఆయిల్ ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల ఉత్పత్తి, మార్కెట్ను బట్టి రెసిపీలో మార్పులు జరిగాయి. కానీ భారత్, యుకె మ్యాగీ ఫార్ములాలో ఉన్న తేడాలను బట్టి యుకె మ్యాగీ మంచి క్వాలిటీతో ఉన్నట్లు కొంతమంది వాదిస్తున్నారు.
నెస్లే కంపెనీకి మరో ఉత్పత్తి కిట్క్యాట్ చాక్లెట్ గురంచి కూడా ఇలాంటి వివాదమే ఉంది. ఆస్ట్రేలియాలో విక్రయించే కిట్క్యాట్ మిల్క్ చాక్లెట్లో కనీసం 22 శాతం కోకో సాలిడ్స్, 25 శాతం మిల్క్ సాలిడ్స్ ఉంటాయి. ఈ ఉత్పత్తిలో 70 శాతం మిల్క్ చాక్లెట్, 30 శాతం వేఫర్ ఫింగర్స్ ఉంటాయి.
కానీ భారత్లోని ఉత్పత్తితో పోలిస్తే ఈ పరిమాణాలు భిన్నంగా ఉన్నాయి. ఇండియాలో విక్రయించే కిట్క్యాట్లో ప్రస్తుత సమాచారం ప్రకారం.. కేవలం 4.5% కోకో సాలిడ్స్ ఉంటాయి. ఇందులో మిల్క్ సాలిడ్స్, రిఫైన్డ్ వీట్ ఫ్లోర్, ఫ్రాక్షనేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్, హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి.
నెస్లే కంపెనీ భారత్లో విక్రయించే లేస్ చిప్స్లో పామోలిన్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి పదార్థాలు ఉంటాయి. భారత్లో విక్రయించే క్లాసిక్ సాల్టెడ్ చిప్స్లో బంగాళాదుంపలు, ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ (పామోలిన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్), అయోడైజ్డ్ ఉప్పు ఉంటాయి. 100 గ్రాములకు 553 క్యాలరీలు, 35.1 గ్రాముల కొవ్వు, 15.8 గ్రాముల సాచురేటెడ్ ఫ్యాట్, 500 మి.గ్రా సోడియం ఉంటాయి.
అదే ఆస్ట్రేలియాలో విక్రయించే లేస్ క్లాసిక్ సాల్టెడ్ పొటాటో చిప్స్లో బంగాళాదుంపలు, కానోలా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఉప్పు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. 100 గ్రాములకు 618 క్యాలరీలు, 13.7 గ్రాముల సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి.
ఈ రెండూ పోల్చితే ఆస్ట్రేలియాలో విక్రయించే లేస్ చిప్స్లో ఆరోగ్యకరమైన కెనోలా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఉండగా.. ఇండియాలో లభించే చిప్స్లో మాత్రం అధిక స్థాయి సోడియం, చౌక వంట నూనెలు (పామోలిన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్) ఉన్నాయి. సోడియం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమదం.
అంతర్జాతీయ బ్రాండ్ల కూల్ డ్రింక్స్లో కూడా దేశాల మధ్య షుగర్ లెవెల్స్లో కూడా మార్పులు ఉన్నాయి. భారత్లో విక్రయించే కొన్ని డ్రింక్స్ ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ చక్కెర ఉందనే విమర్శలు ఉన్నాయి. అందుకే వినియోగదారులు చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి వివరాలను లేబుల్స్లో పరిశీలించాలి.
ఫాంటా ఉదాహరణ: ఫాంటా విషయంలో భారత్, యుకె ఉత్పత్తుల మధ్య పోషక విలువల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. భారత్లోని ఫాంటాలో ప్రతి 100 మిల్లీలీటర్లకు 13.7 గ్రాముల చక్కెర, 56 క్యాలరీలు ఉన్నాయి. అదే యుకెలోని ఫాంటా ఆరెంజ్లో ప్రతి 100 మిల్లీలీటర్లకు కేవలం 4.5 గ్రాముల చక్కెర, 19 క్యాలరీలు ఉన్నాయి. యుకె వెర్షన్లో ఆరెంజ్ జ్యూస్, వెజిటబుల్ కాన్సన్ట్రేట్స్ కూడా ఉన్నాయి.
రాయిటర్స్ మీడియా రిపోర్ట్ ప్రకారం.. భారత్లోని ఫాంటా సమాన పరిమాణంలోని యుకె వెర్షన్తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ చక్కెర కలిగి ఉంది. క్యాలరీల విషయంలో కూడా భారత్లో సుమారు 185 క్యాలరీలు, లండన్లోని వెర్షన్లో 63 క్యాలరీలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
అంటే క్వాలిటీ పరంగా భారత్లో లభించే ఫాంటా కంటే యుకె ఫాంటా బెటర్.
Also Read: కేవలం రూ.1,000 పెట్టుబడితో రూ.3.18 లక్షలు రాబడి.. పిల్లల భవిష్యత్తు కోసం PPF సేవింగ్స్
స్థానిక ఆహార నిబంధనలు ప్రతి దేశంలో వేర్వేరుగా ఉంటాయి. అలాగే ప్రజల రుచులు, ధరలపై ఆసక్తి, పదార్థాల లభ్యత కూడా ప్రభావం చూపుతాయి. అయితే కంపెనీలు అన్ని మార్కెట్లలో భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకే ఇటీవల ఫుడ్ లేబుల్స్ క్లియర్గా ఉండాలని ఇండియాలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పైగా పదార్థాల్లో తేడాలు ఉన్నంత మాత్రాన ఉత్పత్తి సురక్షితం కాదని నిర్ధారించలేం.
Also Read: బాబోయ్.. ఇంటర్న్షిప్ చేస్తే నెలకు రూ.30 లక్షలు.. ఆ స్కిల్స్ ఉంటేనే
ప్యాకేజ్డ్ ఫుడ్ కొనుగోలు చేసేటప్పుడు ఇంగ్రిడియంట్ లిస్ట్, పోషక విలువలను తప్పక చదవాలి. ఇతర దేశాల్లోని ఉత్పత్తులతో పోల్చేటప్పుడు అదే వేరియంట్ను పరిశీలించాలి.