Patti Seema Veereswara Swamy : గోదావరి మధ్య వెలసిన పట్టిసీమ వీరేశ్వరస్వామి ఆలయం జీవితంలో ఒకసారైన సందర్శించాల్సిన క్షేత్రం. ఆధ్యాత్మికంగా ఎంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రకృతి ప్రేమికులకి ఈ ప్రాంతం సుందరమైన పర్యాటక ప్రాంతంగా సుపరిచితం. శివరాత్రి ఉత్సవాల వేళ ఇక్కడే జరిగే జాతర చూడటానికి రెండు కళ్లు చాలవు. గోదావరి ప్రవాహం తగ్గి ఇసుకు తిన్నెలపై ఆలయానికి వెళ్లే ఆ అనుభవం పర్యాటకులకి మరిచిపోలేని అనుభవాన్ని అందిస్తుంది. చుట్టు పక్కల కొండల మధ్య గోదావరి ప్రవాహం మధ్య ఉన్న ఆలయం సుందర దృశ్యాలకు నిలయం. వీరభద్రుడు, భద్రకాళీని వివాహం ఆడిన ప్రాంతం కూడా ఇదే.
ప్రళయకాల రుద్రుడుగా మనం చూసే వీరభద్రుడు లింగ రూపంలో కొలువైన ఏకైక క్షేత్రం కూడా ఇదే. భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆలయం వందళ ఏళ్లక్రితం నిర్మితమైంది. చాళుక్యల కాలంలో ఆలయాన్ని కట్టినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. భాగవతంలో అత్యంత కీలకమైన ఘట్టమైన గజేంద్రమోక్షానికి ఈ ప్రాంతమే సాక్షి అని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ఒక కొండపై ఏనుగు ఆకారంలో ఒక ఎత్తైన శిల దర్శనమిస్తూ ఉంటుంది. అందరూ దీనినే ఏనుగు కొండ అని పిస్తుంటారు. ఒకే క్షేత్రంలో కొలువుదీరిన శివకేశవుల దర్శనం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. లంకను తలపించే ప్రాంతంలోని ఏనుగుగొండ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. స్వామి అనుగ్రహంతో ఒక ఏనుగుకు , మొసలకి ఈ ప్రాంతంలోనే మోక్షం కలిగింది.శివలింగంపై ఆగస్త్యుడి చేతి ముద్రలు ఇప్పటికీ కనిపిస్తాయి.
పాపికొండల మధ్య సాగే గోదావరి తీరాన ఇంకా ఎన్నో ఆలయాలు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది.తీరం వెంట శతాబ్దాల కిందట నిర్మించిన శివాలయాలు, పురాతన వస్తువులు తవ్వకాలల్లో బయటపడ్డాయి. 1996 నుంచి 2003 వరకు పురావస్తు శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు చేశారు. పైడిపాక వద్ద రెండో శతాబ్దం బౌద్ధ కాలం నాటి కట్టడాలకు ఉపయోగించిన ఇటుకలు, దేవాలయాలు, కొన్ని పురాతన వస్తువులు లభ్యమయ్యాయి.