Cough Syrup Deaths: రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఉచితంగా పంపిణీ చేసిన జనరిక్ దగ్గు సిరప్ తాగిన ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. రాజస్థాన్ సికార్లో ఐదేళ్ల బాలుడు రాష్ట్ర ఉచిత మందుల పథకం కింద సరఫరా చేసిన దగ్గు సిరప్ తాగిన తర్వాత అస్వస్థతకు గురైన మరణించాడు. భరత్పూర్లో అదే సిరప్ తీసుకున్న మూడేళ్ల చిన్నారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. అలాగే మధ్యప్రదేశ్ లో ఈ తరహా మరణాలు నమోదు అయ్యాయి.
గత 15 రోజుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కాఫ్ సిరప్ తాగిన ఆరుగురు చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. పిల్లల మరణాలు, అనారోగ్యాలలో దగ్గు సిరప్ పాత్రపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) కేంద్ర బృందం దర్యాప్తు ప్రారంభించింది. మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో సిరప్ నమూనాలను సేకరించింది. డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్ బ్యాచ్లను అత్యవసరంగా పరీక్షించాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా ఈ సిరప్ పంపిణీని నిలిపివేయాలని ఎస్సీడీసీ ఆదేశించింది.
రాజస్థాన్ ప్రభుత్వం కోసం ఓ ఫార్మా సంస్థ తయారు చేసిన జనరిక్ దగ్గు సిరప్ తాగి ఇద్దరు పిల్లలు మరణించగా, కనీసం 10 మంది అనారోగ్యానికి గురయ్యారని అధికారులు గుర్తించారు. అయితే ఈ సిరప్ సురక్షితమని నిరూపించడానికి కొంత మోతాదు తీసుకున్న ఒక వైద్యుడు కూడా స్పృహ కోల్పోయాడు. ఎనిమిది గంటల తర్వాత అతడ్ని కారులో గుర్తించారు.
డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ కాంబినేషన్ తో కేసన్ ఫార్మా తయారు చేసిన దగ్గు సిరప్ వల్ల ఈ ప్రమాదాలు జరిగాయని సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ మందు తాగిన గంటల వ్యవధిలోనే ఐదేళ్ల బాలుడు మరణించాడు.
రాజస్థాన్లో సికార్ జిల్లాకు చెందిన 5 ఏళ్ల నితీష్కు దగ్గు, జలుబు రావడంతో తల్లిదండ్రులు ఆదివారం చిరానాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లారు. వైద్యుడు వారికి ఓ దగ్గు సిరప్ ఇచ్చారు. నితీష్ తల్లి ఆ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బాలుడికి సిరప్ పట్టింది. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా నిద్ర లేచిన నితీష్ కు ఎక్కిళ్లు వచ్చాయి. బాలుడికి కొంచెం నీళ్లు ఇవ్వడంతో అతడు నిద్రపోయాడు. ఆ తర్వాత బాలుడు మేల్కోలేదు. బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అదేవిధంగా మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో ఒకే కాంబినేషన్ లో ఉన్న దగ్గు సిరప్లను తాగిన పిల్లలు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లతో మరణించారు. దీతో కోల్డ్రిఫ్, నెక్స్ట్రో-డీఎస్ సిరప్లను ఆ జిల్లా యంత్రాంగం నిషేధించింది.
జైపూర్కు చెందిన కేసన్స్ ఫార్మా కంపెనీ తయారు చేసిన సిరప్ బ్యాచ్ నంబర్లు KL-25/147, KL-25/148 లపై రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఆరోగ్య అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. జూన్ నుండి 1,33,000 మందికి పైగా రోగులు ఈ సిరప్ను పొందారని ఈ కమిటీ గుర్తించింది.
Also Read: UP News: 75 ఏళ్ల వయస్సులో పెళ్లి.. ఫస్ట్ నైట్ జరిగిన తర్వాతి రోజే ప్రాణాలు విడిచిన వరుడు
ఇటీవలి చిన్నారుల మరణాలతో రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిరప్ పంపిణీని నిలిపివేసింది. కేసన్స్ ఫార్మా నుండి ఈ సిరప్ లను మందులషాపులకు పంపిణీ చేయకుండా నిషేధించారు. మరొక సరఫరాదారు దగ్గు సిరప్ కూడా ముందు జాగ్రత్తగా పరీక్షిస్తున్నారు.