ఇప్పటి వరకు తీవ్ర నేరాలకు పాల్పడిన దోషులకు జీవిత ఖైదు విధించడం చూశాం. కానీ, ఇకపై కుక్కలకు కూడా ఈ శిక్షలు పడబోతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, త్వరలో ఈ విధానం అమలు కాబోతోంది. గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా వీధి కుక్కలు కరవడంతో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎంతో మంది రేబిస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం వీధి కుక్కలను షెల్టర్ కు తరలించాని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై జంతు ప్రేమికులు ఆందోళన కొనసాగించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
తాజాగా వీధి కుక్కల పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో కుక్కకాటుకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది చిన్నారు రేబిస్ వ్యాధి బారిన పడుతున్నారు. రోజు రోజుకు కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండుసార్లు మనిషిని కరిస్తే, ఆ కుక్కు జీవిత ఖైదు విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేయించారు.
ఇప్పటికే వీధి కుక్కలను నియంత్రించడానికి యూపీ ప్రభుత్వం జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ప్రయాగరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షామ్స్ నగర్ లో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీనిలో కుక్కలకు టీకాలు వేయడంతో పాటు వాటికి కావాల్సిన అన్ని రకాల వసతులను కల్పించారు. ఏదైనా కుక్క తొలిసారి మనిషిని కరిస్తే, ఆ కుక్కను పట్టుకుని షెల్టర్ కు తీసుకెళ్తారు. అక్కడ 10 రోజుల పాటు ఉంచుతారు. దానికి టీకా వేసి, బాడీలో మైక్రో చిప్ ను ఏర్పాటు చేసి బయటకు వదిలేస్తారు. అదే కుక్క రెండోసారి మనిషిని కరిస్తే, దానిని అదే సెంటర్ లో జీవితాంతం ఉంచనున్నారు.
కుక్కకు జీవిత ఖైదు విధించే విషయంలో పశుసంవర్ధక అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, SPCA సభ్యుల కమిటీ విచారణ జరుపుతుంది. ఈ విచారణలో కుక్క రెండోసారి కరిచినట్లు తేలితేనే జీవితి ఖైదు విధించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ లైవ్స్టాక్ ఆఫీసర్ విజయ్ అమృత్ రాజ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఈ ఉత్తర్వులు అన్ని మున్సిపల్ సంస్థలకు అందాయన్నారు. “కుక్క రెండవసారి ఎవరినైనా కరిస్తే, ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ చేస్తుంది. ఇందులో పశుసంవర్ధక అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, SPCA సభ్యులు ఉంటారు. కరిచింది అనేదానికి కచ్చితమైన ఆధారాలు లభిస్తే, సదరు కుక్కకు జీవిత ఖైదు విధిస్తారు” అని చెప్పుకొచ్చారు.
Read Also: అంత బద్దకం ఎందుకు? జెమినీ AI శారీ ట్రెండ్పై టాటా ఫ్రెండ్ శాంతను నాయుడు సెటైర్!