Boat capsized in Africa(Today international news headlines): ఆఫ్రికాలో వలసదారులకు కష్టాలు తీవ్రమయ్యాయి. కడుపు నిండా తిండి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రాంతాలు వలసే కాదు.. దేశాలు దాటి మరీ వెళ్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది గంగమ్మ ఒడిలో కన్నుమూస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో మారిటానియా తీరంలో వలస పడవ బోల్తా పడిన ఘటనలో 105 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 90 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా గల్లంతు అయినట్టు అధికారులు చెబుతున్నారు.
జూలై మొదటి వారం మారిటానియా తీరంలో వలసదారుల పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 105 మంది సముద్రంలో చనిపోయిన విషయం తెల్సిందే. లభ్యమైన మృతదేహాలను పూడ్చి పెట్టినట్టు అక్కడి అధికారులు చెప్పారు. మైగ్రేషన్ రైట్స్ గ్రూప్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2024 ఏడాది మొదలు ఇప్పటివరకు సుమారు ఐదువేల మంది వలసదారులు కానరీ దీవులకు వెళ్తుండగా బోటు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు.
పశ్చిమ ఆఫ్రికా నుంచి కానరీ దీవులకు వెళ్లాలంటే అట్లాంటిక్ సముద్రం మీదుగా వెళ్లాలి. ప్రపంచంలో అత్యంత డేంజరైన మార్గాల్లో ఇది కూడా ఒకటి. ఈ మార్గం ద్వారానే ఆఫ్రికన్ వలసదారులు యూరప్ చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా వేసవికాలంలో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది కూడా.
ALSO READ: బ్రిటన్ కొత్త ప్రధాని.. ఎవరీ కైర్ స్టార్మర్?
ఆఫ్రికాలోని కొన్ని దేశాల ప్రజలు ప్రాణాలకు తెగించి ఇలాంటి మార్గాల ద్వారా దేశం దాటుతున్నట్లు కొన్ని సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, హింసాత్మక ఘటనలు, రాజకీయ సంక్షోభాలు వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు విదేశాలకు శరణార్ధులుగా వెళ్లేందుకు కారణమవు తున్నారు.