Ali Khamenei Controversies: అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా ముస్లిం దేశాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ లోని కాశ్మీర్, యూపీలోని లక్నో ప్రాంతాల్లో ఖమేనీ మృతిని ఖండిస్తూ నిరసనలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా ఇరాన్ లో మాత్రం ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న నిరంకుశ పాలన నుంచి తమకు స్వేచ్ఛ లభించిందని ఇరాన్ వీధుల్లో వేడుకలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఖమేనీ నిరంకుశ పాలనలోని వివాదస్పద అంశాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.
అలీ ఖమేనీ 1989 నుండి ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగుతూ వచ్చారు. ఖమేనీ పాలనలో ప్రజాస్వామ్యానికి తావులేదని, వ్యతిరేక స్వరాలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ద్వారా ఉక్కుపాదంతో అణిచివేస్తారని విమర్శలు ఉన్నాయి. ఖమేనీ హయాంలో రాజకీయ ఖైదీలకు, నిరసనకారులకు కోర్టులు వేగంగా మరణశిక్షలు అమలు చేయడంపై అంతర్జాతీయంగా విమర్శలు ఉన్నాయి. 1988లో (ఖమేనీ సుప్రీం లీడర్ కాకముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు) సుమారు 30,000 మంది రాజకీయ ఖైదీలను ఉరితీశారని అమ్నెస్టీ వంటి సంస్థలు పేర్కొన్నాయి. ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాక కూడా అదే తరహా కఠిన విధానాలను కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఖమేనీ పాలనలో ఇరాన్ మహిళలు తీవ్ర అణచివేతకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 2022లో ‘మహ్సా అమీని’ మరణం తర్వాత జరిగిన ‘వుమెన్, లైఫ్, ఫ్రీడం’ ఉద్యమాన్ని కఠినంగా ఆయన అణిచివేశారు. మహిళలు ‘ఇంటి మేనేజర్లు’ అని, వారి ప్రధాన బాధ్యత పిల్లల పెంపకం, ఇంటి పనులే అని ఖమేనీ వ్యాఖ్యానించడం గతంలో వివాదస్పదమైంది. అంతేకాకుండా హిజాబ్ ధరించకపోవడాన్ని రాజకీయ, మతరమైన పాపంగా ఆయన ప్రకటించడం గమనార్హం. అయితే మహిళలను జంతువులు, వస్తువులతోనూ ఖమేనీ పోల్చినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి.
తన పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలను ఖమేలీ తీవ్రంగా అణిచివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెట్రోల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా 2019లో బ్లడీ నవంబర్ పేరుతో జరిగిన నిరసనల్లో వందలాది మంది ప్రజలను ఇరాన్ భద్రతాబలగాలు కాల్చి పారేశాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం దాదాపు 1500 మంది ఇరాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే వుమెన్, లైఫ్, ఫ్రీడం (2022-23) ఆందోళనల సమయంలో సుమారు 550 మందికి పైగా మరణించగా వేలాది మంది అరెస్టు అయ్యారు. ఎన్నికల రిగ్గింగ్ కు వ్యతిరేకంగా 2009లో జరిగిన నిరసనల్లోనూ వందలాది మంది మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా గత కొన్నిరోజులుగా ఇరాన్ లో జరుగుతున్న నిరసనల్లోనూ 30,000 నుండి 36,500 మంది వరకు మరణించినట్లు అంచనాలు ఉన్నాయి.
ఖమేనీ దాదాపు 37 ఏళ్ల నిరంకుశ పాలనలో కేవలం ప్రజా నిరసనలను అణిచివేయడం ద్వారానే లక్ష మందికి పైగా ఇరాన్ పౌరులను బలితీసుకున్నారని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. అలాంటి ఖమేనీని అమెరికా – ఇజ్రాయెల్ దళాలు క్షిపణుల వర్షం కురిపించి మట్టుబెట్టడంతో ఇరాన్ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. టెహ్రాన్, కరాజ్ ఇతర నగరాల్లో ప్రజలు తమ ఇళ్ల కిటికీల నుండి, పైకప్పుల నుండి కేకలు వేస్తూ సంబురాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది రహస్యంగా స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ పండుగ చేసుకున్నారు.
భారత్ లో మాత్రం ఖమేనీ మరణానికి వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లోని లాల్ చౌక్ వంటి ప్రాంతాల్లో షియా ముస్లింలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నల్ల జెండాలు పట్టుకుని ఖమేనీ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో కూడా షియా కమ్యూనిటీ మూడు రోజుల సంతాపం ప్రకటించింది. మసీదుల వద్ద నల్ల జెండాలు ఎగురవేసి నిరసనలు తెలిపారు. అయితే ఖమేనీ నిజస్వరూపం తెలియనందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారని ఇరాన్ ప్రజలు చెబుతున్నారు. ఆయన చేసిన అరాచకాలు, అణిచివేతల గురించి తెలిస్తే వారు ఇలా నిరసనలు తెలియజేసే వారు కాదని పేర్కొంటున్నారు.
Also Read: Kalvakuntla Kavitha: ఆ సమయానికి పార్టీ రావడం ఖాయం.. గతాన్ని తలుచుకుంటూ కవిత ఎమోషనల్