Interim Supreme Leader Killed: పశ్చిమ ఆసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతోంది. దశాబ్దాల కాలం పాటు ఇరాన్ను శాసించిన అలీ ఖమేనీ.. ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడుల్లో మరణించడంతో ఆ దేశం సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో ఖమేనీ వారసుడిగా మధ్యంతర సుప్రీం లీడర్గా సీనియర్ మతగురువు ఆయతుల్లా అలీరెజా అరాఫీని ఇరాన్ ప్రభుత్వం నియమించింది. అయితే బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే అరాఫీ కూడా వైమానిక దాడిలో మరణించారనే వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇరాన్ స్టేట్ మీడియా కానీ, అంతర్జాతీయ వార్తా సంస్థలు కానీ దీనిని ఇంకా ధృవీకరించలేదు.
మార్చి 2 నాటికి అందుతున్న సమాచారం ప్రకారం అరాఫీ మరణంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. గతంలో ఖమేనీ మరణం విషయంలో కూడా మొదట ఇజ్రాయెల్ వర్గాలు ధృవీకరించగా.. ఆ తర్వాతే ఇరాన్ అధికారులు అంగీకరించారు. ఇప్పుడు అరాఫీ విషయంలోనూ అదే జరుగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ రాజకీయ, మతపరమైన వ్యవస్థల్లో కీలక వ్యక్తిగా ఉన్న అరాఫీని ఖమేనీ మరణించిన రోజే సుప్రీం లీడర్గా ఎంపిక చేశారు. ఒకవేళ అరాఫీ మరణవార్త నిజమైతే అది ఇరాన్ నాయకత్వ వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ అవుతుంది.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వరుస దాడులతో భారీస్థాయిలో ప్రాణనష్టం.. ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇరాన్ అత్యున్నత నాయకత్వమే లక్ష్యంగా జరుగుతున్న దాడులతో ఆ దేశం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అరాఫీ మరణంపై స్పష్టత వస్తే తప్ప ఇరాన్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ప్రస్తుతం టెహ్రాన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.