Israel Strikes Iran: పశ్చిమ ఆసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు కీలక నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళాలు వరుస దాడులతో విరుచుకుపడుతున్నాయి. శత్రువుల క్షిపణి దాడుల ధాటికి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. దేశ అత్యున్నత నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులు ఇరాన్ సైనిక యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బాంబుల మోతతో ఆ దేశంలోని ప్రధాన నగరాలు యుద్ధక్షేత్రాలుగా మారిపోయాయి.
తాజా పరిణామాల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి మజీద్ ఇబెన్ అల్-రెజా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. మజీద్ రక్షణ మంత్రిగా నిన్ననే (మార్చి 2, 2026) బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన 24 గంటల లోపే ఆయన మృతి చెందడం ఇరాన్ సైనిక వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రక్షణ మంత్రి నివాసం లేదా ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మరోవైపు ఇరాన్ అత్యున్నత నాయకుడు దివంగత ఆయతుల్లా అలీ ఖమేనీ కుటుంబంలో మరో తీరని విషాదం చోటుచేసుకుంది. ఖమేనీ భార్య ఖుజిస్తా బాఘేరి కూడా మంగళవారం మరణించింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. వరుసగా అగ్రనేతల మరణాలు ఇరాన్ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటున్న ఇరాన్ లో ప్రస్తుతం ఒక తాత్కాలిక నాయకత్వ మండలి (Interim Leadership Council) పాలన బాధ్యతలు చేపట్టింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని.. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో చమురు ధరలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లను కలవరపెడుతోంది.
Read Also: Iran School Airstrike Minab: యుద్ధానికి బలైపోయిన బాల్యం.. 165 మంది బాలికలకు సామూహిక అంత్యక్రియలు!