Warangal Airport: దేశంలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటు వేగంగా జరుగుతున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సదుపాయాలను పెంచేందుకు అడుగులు వేస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి రూ. 496.86 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర పౌర విమానయానశాఖ సహాయమంత్రి తెలిపారు.
తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులపై కేంద్రం ప్రకటన-తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్. మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ. 496.86 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు.
వరంగల్ ఎయిర్పోర్టు నిధులు మంత్రి ప్రకటన-రన్వే, ఏప్రాన్, టాక్సీవే, కాంపౌండ్ వాల్ వంటి పనుల కోసం టెండర్లు ఆహ్వానించినట్టు తెలియజేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కావడమనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల బట్టి ఉంటుందన్నారు. ముఖ్యంగా భూసేకరణ, చట్టబద్ధమైన అనుమతులు, ఇతర మౌలిక వసతుల కల్పనపై ఆధారపడి ఉంటుందన్నారు.
టెండర్లు ఆహ్వానం- మామునూర్ ఎయిర్పోర్టులో కీలక మౌలిక సదుపాయాల కోసం టెండర్లు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మిగతా విమానాశ్రయాల సాధ్యాసాధ్యాల అధ్యయనాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలియజేసింది. ఆదిలాబాద్ విమానాశ్రయం గురించి మాట్లాడిన మంత్రి, దాన్ని అభివృద్ధి చేయడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాంకేతిక-ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని పూర్తి చేసిందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్పోర్టుకు అడ్డంకి-ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందని వివరించారు. పెద్దపల్లిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఏఏఐ తన ప్రాథమిక సాధ్యాసాధ్యాల అధ్యయన నివేదికను ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాజెక్టుకు అడ్డంకి ఎదురైంది.
ALSO READ: హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో
గతేడాది జనవరిలో రామవరం, చుంచుపల్లి, సుజాతనగర్ గ్రామాలలో నిర్వహించిన సర్వేలో చుట్టూ కొండలు, రైల్వే లైన్ ఉండటం వల్ల ఆ ప్రాంతం అనుకూలం కాదని, ఆ ప్రదేశంలో విమానాశ్రయ అభివృద్ధి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ ప్రాంతానికి ఎయిర్పోర్టు వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని భావించారు. కేంద్రం తాజా ప్రకటనలో ఆ ప్రాంత ప్రజలకు నిరాశ మిగిలింది. ఇతర ప్రాంతాలలో విమానయాన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు.