Delcy Rodríguez: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై మొదట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ దేశ యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్, ప్రస్తుతం తన వైఖరిని మార్చుకున్నారు. ట్రంప్ ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. “అంతర్జాతీయ చట్టాల పరిధిలో, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యంగా సహకార అజెండాపై పనిచేయడానికి అమెరికా ప్రభుత్వానికి ఆహ్వానం పలుకుతున్నాం” అని ఈ మేరకు తమ దేశంతో కలిసి పనిచేయాలని అమెరికాను కోరారు.
శనివారం మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న వెంటనే డెల్సీ తీవ్రంగా స్పందించారు. అయితే, కేవలం కొన్ని గంటల్లోనే ఆమె మాట మార్చడం వెనిజులా రాజకీయ నాయకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు, వెనెజువెలాను నడిపించేందుకు అమెరికా అధికారుల బృందం ఉంటుందని, వారితో కలిసి డెల్సీ రోడ్రిగ్జ్ పని చేస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో ఆయన డెల్సీకి గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు. “ఆమె సరిగ్గా వ్యవహరించకపోతే, మదురో కంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.” అని వ్యాఖ్యానించారు. దేశ పునర్నిర్మాణానికి ఆయిల్ నిల్వలపై అమెరికాకు పూర్తి ఆధిపత్యం అవసరమని ట్రంప్ పునరుద్ఘాటించారు.
అమెరికాను సామ్రాజ్యవాద ముప్పుగా భావించే వెనెజువెలా ప్రభుత్వంలోని కఠిన వైఖరి గల నాయకులు, డెల్సీ తాజా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. సోమవారం నేషనల్ అసెంబ్లీలో కొత్త చట్టసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుండటంతో డెల్సీ పట్టుపై స్పష్టత రానుంది. కాగా, మదురోను సోమవారం న్యూయార్క్ కోర్టులో హాజరుపరుచనున్నారు.
Read Also: అమెరికా కస్టడీలో మదురో.. సైనికులతో ఉన్న ఫొటో వైరల్.. సద్దాం హుస్సేన్ తర్వాత