Tirupati Srivari Darshanam :- వేసవి సెలవుల రద్దీతో తిరుమలకి వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. శని, ఆదివారాల్లోనే కాదు మిగతా రోజుల్లో తిరుమల భక్తులతో నిండిపోతోంది. సర్వదర్శనం కోసం 30 నుంచి 40 గంటలపాటు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వీకెండ్ లో ఇది మరింత పెరుగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకుంటుండటంతో తిరుమలకి వెళ్తున్న భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వస్తుండటంతో.. మొక్కులు తీర్చుకునే వారు ఏడుకొండల వాడి దర్శనానికి క్యూ కడుతున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని మార్పులు చేసింది. జూన్ 30rec వరకు గోవిందుడి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ ప్రకటించారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్న శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో సుప్రభాత సేవలో మార్పులు చేశారు. విచక్షణ కోటాను రద్దు చేశారు. దీని వల్ల 20 నిమిషాల సమయం ఆదా కావడం భక్తులకు ఉపయోగపడుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. అలాగే గురువారం రోజు నిర్వహించే తిరుప్పావడ సేవ ఏకాంతంగా జరిపించనున్నారు. ఈ మార్పు వల్ల సుమారు అరగంటపాటు సమయం కలిసి వస్తుంది. అలాగే వీఐపీ సిఫార్సు లేఖలను శుక్ర, శని, ఆదివారాల్లో స్వీకరించకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది.
నేరుగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. సిఫార్సు లేఖల విషయంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతిరోజు 3 గంటల టైం ఆదా అవుతుందని టీటీటీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ మార్పులు గమనించాలని కోరుతోంది. మరోవైపు జూలై, ఆగస్టు నెలలకు చెందిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.