New Year 2026: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఒకే సమయంలో జరుగుతుంది అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే.. భూమి తిరిగే విధానం, టైమ్ జోన్ల కారణంగా కొన్ని దేశాలు ముందుగానే కొత్త ఏడాదిని స్వాగతిస్తే, మరికొన్ని దేశాలు కాస్త ఆలస్యంగా న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో 2026లోకి మొదటగా అడుగుపెట్టిన దేశం ఏది? భారత్ ఏ స్థానంలో ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో 2026లోకి మొదటగా అడుగుపెట్టిన దేశం కిరిబాటి(Kiribati). పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ చిన్న ద్వీప దేశం, ప్రపంచంలోనే అత్యంత ముందున్న UTC +14 టైమ్ జోన్లో ఉంది. దీంతో మిగతా దేశాలన్నింటి కంటే ముందే ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. ప్రత్యేకంగా కిరిబాటికి చెందిన కిరిటిమాటి (Christmas Island) ద్వీపం.. ప్రపంచంలో తొలి నూతన సంవత్సర వేడుకలకు కేంద్రబిందువుగా పేరుగాంచింది.
భారతదేశం.. ఇండియన్ స్టాండర్డ్ టైమ్(UTC+5:30)ను అనుసరిస్తుంది. అందువల్ల కొత్త ఏడాదికి వెళ్లే క్రమంలో భారత్ మధ్యస్థ స్థానంలో ఉంటుంది. మన దేశాని కంటే ముందే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, చైనా వంటి దేశాల్లో 2026 ప్రారంభం అవుతుంది. మన తర్వాత యూరప్ దేశాలు, ఆపై అమెరికా ఖండంలో న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి. అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల క్రమంలో భారత్ సుమారు 60 నుంచి 70వ స్థానం మధ్యలో 2026లోకి ప్రవేశిస్తుంది.
ప్రపంచంలో చివరగా నూతన సంవత్సరాన్ని జరుపుకునే ప్రాంతాలు అమెరికాకు చెందిన బేకర్ ఐలాండ్, హౌలాండ్ ఐలాండ్. ఇవి Coordinated Universal Time-12 టైమ్ జోన్లో ఉండటం వలన ప్రపంచంలోని చాలా దేశాలు 2026లోకి అడుగుపెట్టిన చాలా గంటల తర్వాత ఇక్కడ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
మనమందరం ఒకే భూమిపై ఉన్నప్పటికీ.. టైమ్ జోన్ల కారణంగా నూతన సంవత్సరం ప్రపంచమంతా దాదాపు 26 గంటల పాటు కొనసాగుతుంది. ఒకచోట ఫైర్వర్క్స్తో 2026కు స్వాగతం పలుకుతుంటే.. ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా 2025 చివరి క్షణాలు గడుస్తూనే ఉంటాయి. ఇదే భూమి ప్రత్యేకత.. టైమ్ జోన్ మ్యాజిక్.