మన వంటల్లో చింతపండును అధికంగానే వాడతాము. పులుసులు, సాంబార్, చట్నీలు, రసాలు ఇలా చాలా వంటల్లో చింతపండును వాడుతూ ఉంటాము. ఇక ప్రసాదం పులిహోర వండాలంటే చింతపండును అధికంగానే వాడతారు. అయితే చింతపండు ఎక్కువగా తింటే రక్తం విరుగుతుంది అనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఇది కేవలం అపోహ మాత్రమేనా? దీనిపై వైద్యులు ఏమంటున్నారు? తెలుసుకోండి.
చింతపండులోని పోషకాలు
చింతపండు సహజంగా పుల్లగా ఉండే పదార్థం. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి ఉపయోగపడే పోషకాలు. చింతపండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటానికి, ఆకలి పెరగడానికి ఇది సహాయపడుతుంది. వైద్యులు చెబుతున్న ప్రకారం చింతపండుకు నేరుగా రక్తాన్ని విరిచే గుణం లేదు. అంటే రక్తనాళాలు పగిలిపోవడం లేదా రక్తం నీరుగా మారిపోవడం వంటి సమస్యలను చింతపండు కలిగించదు. అయితే ప్రతిరోజూ ఎక్కువ మోతాదులో చింతపండును ప్రతిరోజూ తీసుకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు రక్తం విరిగిందని అపోహ పడుతుంటారు. చింతపండు ఎక్కువగా తినడం వల్ల ముఖ్యంగా పొట్ట పై ప్రభావం చూపుతుంది. చింతపండులో ఉండే అధిక పులుపు వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు మంట, అసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలం చింతపండు అధికంగా తింటే మాత్రం శరీరంలో పోషకాలు శోషణ తగ్గిపోతుంది.దీని వల్ల బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో రక్తం విరిగింది అని అంటారు. కొంతమందిలో చింతపండు అధికంగా తినడం వల్ల ఐరన్ శోషణకు ఆటంకం కలగవచ్చు. దీని వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనత అంటే రక్తం తక్కువ అవడం, శరీరానికి తగిన ఆక్సిజన్ అందకపోవడం. దీన్ని కూడా చాలామంది రక్తం విరిగినట్టుగా భావిస్తారు. కానీ ఇది రక్తం పగిలిపోవడం కాదు, కేవలం రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం మాత్రమే.
వీరు తినకూడదు
చింతపండును కొన్నిరకాల సమస్యలు ఉన్నవారు తినకూడదు.గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం అధికంగా సమస్యలు ఉన్నవారు, అల్సర్లు ఉన్నవారు, అధిక అసిడిటీతో బాధపడేవారు చింతపండు ఎక్కువగా తినకూడదు. వీరిలో పుల్లటి ఆహారం వల్ల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యవంతులైన వ్యక్తులు పరిమిత మోతాదులో చింతపండు తీసుకుంటే ఎలాంటి హానీ లేదు. వంటల్లో సరైన మోతాదులో వాడితే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి. చింతపండులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని రోగాల నుంచి కాపాడేందుకు సహాయపడతాయి. మలబద్ధకం తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఏ ఆహారం అయినా అతిగా తీసుకుంటేనే సమస్య. చింతపండు కూడా అంతే. రోజూ ఎక్కువగా పుల్లటి ఆహారం తీసుకోవడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతింటుంది. దాంతో రక్తహీనత, బలహీనత వంటి సమస్యలు రావచ్చు. మొత్తానికి చింతపండు అధికంగా తింటే రక్తం నేరుగా విరగదు. అయితే అతిగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమతుల ఆహారంలో భాగంగా, పరిమిత మోతాదులో చింతపండు తీసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మరింత మంచిది.