India Pakistan Relations: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, దౌత్యపరమైన విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ భారత్, పాకిస్థాన్ దేశాలు ఓ కీలకమైన సంప్రదాయాన్ని మాత్రం విస్మరించలేదు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా, దాయాది దేశాలు తమ అణు స్థావరాలు, కేంద్రాల జాబితాను పరస్పరం మార్చుకున్నాయి. గురువారం (జనవరి 1) న్యూఢిల్లీ మరియు ఇస్లామాబాద్లలో దౌత్య మార్గాల ద్వారా ఈ ప్రక్రియ ఏకకాలంలో పూర్తయింది.
భారత్, పాకిస్థాన్ మధ్య 1988 డిసెంబర్ 31న “అణు కేంద్రాలపై దాడుల నిషేధ ఒప్పందం” కుదిరింది. ఈ ఒప్పందం 1991 జనవరి 27న అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం, యుద్ధం లేదా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ఒక దేశం మరొక దేశంలోని అణు కేంద్రాలపై దాడి చేయకూడదు. ఈ రక్షణను కల్పించాలంటే, తమ దేశంలో అణు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవతలి దేశానికి అధికారికంగా తెలియజేయాలి. అందుకే ప్రతీ ఏడాది జనవరి 1వ తేదీన ఈ జాబితాలను మార్చుకుంటారు.
ఈ ఒప్పందం ప్రకారం మొదటిసారిగా 1992 జనవరి 1న ఇరు దేశాలు జాబితాలను పంచుకున్నాయి. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ప్రక్రియ జరుగుతోంది. పుల్వామా దాడి, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఈ సంప్రదాయానికి బ్రేక్ పడలేదు. నేటితో ఈ మార్పిడి జరగడం వరుసగా ఇది 35వ సారి.
అణు స్థావరాల జాబితాతో పాటు, ఇరు దేశాల జైళ్లలో మగ్గుతున్న పౌరులు, మత్స్యకారులు, రక్షణ సిబ్బంది వివరాలను కూడా ఈరోజు పరస్పరం అందజేసుకున్నారు. 2008 కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ఏడాదికి రెండు సార్లు (జనవరి 1, జూలై 1) ఈ ఖైదీల జాబితాను మార్చుకుంటారు. అణ్వాయుధ దేశాలైన భారత్, పాక్ల మధ్య విశ్వాసాన్ని పెంపొందించడానికి (Confidence Building Measures) ఈ ఒప్పందాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.
Read Also: చలి తగ్గుముఖం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు!