మన రోజువారీ ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. పగలు తిన్నా, రాత్రి తిన్నా, చాలా మంది పెరుగును ఏ సమయంలోనైనా తిన్నా ఆరోగ్యానికి మంచిదనే భావిస్తారు. కానీ పెద్దలు రాత్రిపూట పెరుగు తినొద్దని చాలాసార్లు హెచ్చరిస్తుంటారు. దీనికి కారణం ఏమిటనే సందేహం చాలామందికి ఉంటుంది. అసలు రాత్రిపూట పెరుగు తినడం వల్ల శరీరంలో ఏ మార్పులు వస్తాయో, వైద్య నిపుణులు ఏమంటారో తెలుసుకోండి. ఆయుర్వేదం ప్రకారం పెరుగు చల్లని స్వభావం కలిగిన ఆహారం. రాత్రివేళ శరీరం సహజంగానే చల్లబడే సమయం. ఈ రెండు కలిసినప్పుడు శరీరంలో కఫం, జలుబు, దగ్గు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్లే పాతకాలం నుంచి రాత్రిపూట పెరుగు తినకూడదన్న నమ్మకం ఉంది. అయినప్పటికీ పెరుగను ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ప్రభావం చూపించదు.
పెరుగులో ఉండే పోషకాలు
పెరుగులో కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ వంటి శరీరానికి మంచిగా పనిచేసే పోషకాలు ఉన్నాయి. అయితే రాత్రివేళ పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదించే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మన శరీరం రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ సమయంలో పెరుగు కొంచెం భారమైన, శీతల గుణం ఉన్న ఆహారం. దీన్ని తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, బరువుగా అనిపించడం, కొన్నిసార్లు అజీర్ణం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సైనస్, అలర్జీ, కఫ సమస్యలు ఉన్నవారిలో రాత్రి పెరుగు తింటే లక్షణాలు మరింత పెరిగి కఫం ఏర్పడి ఇబ్బందికరంగా మారవచ్చు. దీనివల్ల ఉదయం లేచినప్పుడు గొంతు బరువుగా ఉండటం, ముక్కు దిబ్బడ, తుమ్ములు ఆగకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సమస్యలు ఉన్నవారు అయితే రాత్రివేళ పెరుగు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పూర్తిగా తినకూడదా?
అయితే రాత్రి పెరుగు పూర్తిగా నిషేధమా? ఆరోగ్య నిపుణుల ప్రకారం రాత్రి పెరుగు తినాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. ఉదాహరణకు పెరుగును నేరుగా చల్లగా తినకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యేలా ఉంచి తినడం మంచింది. పెరుగులో ఒక చిటికెడు జీలకర్ర పొడి, మిరియాల పొడి కలిపితే కఫం తగ్గి జీర్ణక్రియ సులభమవుతుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా శరీరంలోని చల్లదనం తగ్గుతుంది. అలాగే పెద్ద పరిమాణంలో కాకుండా కొద్దిగా మాత్రమే తినాలి. ముఖ్యంగా రాత్రి అన్నం తిన్నాక పెరుగు అన్నం చేసుకుని పెద్ద గిన్నె నిండా తినడం తప్పించుకోవాలి. పెరుగు తప్పనిసరిగా తినాలి అనిపిస్తే దోసకాయ, ఉల్లి, ఇతర చల్లని పదార్థాలతో కలిపి తినకూడదు. ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే రాత్రి పెరుగు తింటే కూడా పెద్ద ఇబ్బందులు రాకపోవచ్చు.
రాత్రిపూట పెరుగు తినకూడదు అనే నమ్మకం పూర్తిగా తప్పు కాదు, కానీ కొన్ని సందర్భాల్లో తినకపోవడమే మంచిది. శరీరానికి కఫం ఎక్కువగా ఉండేవారికి, అలర్జీలు ఉన్నవారికి, జలుబు త్వరగా వచ్చే వారికి రాత్రి పెరుగు సమస్యలు కలిగిస్తుంది. అలాగే సైనస్ లేదా చర్మ సమస్యలు ఉన్నవారు కూడా రాత్రిపూట పెరుగు తినడం మానేస్తే మంచిది. కానీ ఆరోగ్య సమస్యలు లేని వారు, ముఖ్యంగా పొట్ట ఆరోగ్యంగా ఉన్నవారు, తగిన జాగ్రత్తలతో పెరుగు తింటే పెద్దగా హాని ఉండదు. పెరుగును రాత్రి కంటే పగలు తినడం ఆరోగ్యానికి మంచిది.పగలు తింటే ప్రోబయోటిక్స్ కడుపును చురుకుగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అందువల్ల వైద్యులు సాధారణంగా రాత్రి పెరుగు తినడం తగ్గించాలని, పగలు తినడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిమిత మోతాదులో, సరైన రీతిలో పెరుగు తీసుకుంటే అది శరీరానికి తప్పకుండా ఉపయోగపడుతుంది.