పిల్లలు పుట్టగానే ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే తల్లి కాగానే కొందరు మహిళలు మానసికంగా బాధపడుతుంటారు. ప్రసవం తర్వాత ఆ మహిళలు నిరంతరం బాధ, ఆందోళన, అలసట, తరుచూ ఏడుస్తూ ఉంటారు. చాలామంది వీటిని సాధారణ అలసట లేదా మూడ్ స్వింగ్స్ అని అనుకుంటారు. కానీ ఈ లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే ఇది పోస్ట్పార్టమ్ డిప్రెషన్ అయ్యే అవకాశం ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, పోస్ట్పార్టమ్ డిప్రెషన్ అనేది ప్రసవం తర్వాత వచ్చే మానసిక ఆరోగ్య సమస్య. ఇది మొదటిసారి తల్లి అయినా, ఇప్పటికే పిల్లలు ఉన్న మహిళ అయినా ఎవరికైనా రావచ్చు. ప్రసవం తర్వాత శరీరంలోని హార్మోన్లు వేగంగా మారుతాయి. అలాగే నిద్రలేమి, శారీరక బలహీనత, మానసిక ఒత్తిడి, కొత్త బాధ్యతలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి.
ఈ లక్షణాలు రెండు వారాలకు పైగా కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
చికిత్స ఆలస్యం అయితే ఈ సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఇది తల్లి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే బిడ్డ సంరక్షణలో ఇబ్బందులు ఏర్పడి, శిశువు ఎదుగుదలపై కూడా ప్రభావం చూపవచ్చు.
తీవ్రమైన పరిస్థితుల్లో ఆత్మహత్య లేదా బిడ్డకు హాని చేయాలనే ఆలోచనలు కూడా రావచ్చు. అందుకే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.
ఇప్పటికే డిప్రెషన్ లేదా ఆందోళన సమస్యలు ఉన్న మహిళల్లో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో అధిక ఒత్తిడి ఉండటం కూడా కారణమవుతుంది. కుటుంబ సహకారం లేకపోవడం, ఆర్థిక లేదా కుటుంబ సమస్యలు ఉండటం, సరిపడా నిద్ర లేకపోవడం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.
Also Read: పాము కాటేసిన తరువాత ఎంతసేపు నిద్రపోకూడదు.. నిద్రపోతే ఏమవుతుంది?
ప్రతిరోజూ తగినంత విశ్రాంతి తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహాతో తేలికపాటి వ్యాయామం చేయాలి.
తన భావాలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోవాలి. అవసరమైతే సహాయం కోరడంలో వెనుకాడకూడదు. లక్షణాలు కనిపిస్తే సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్టును సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు.
ప్రసవం తరువాత వెంటనే ఇలాంటి సమయంలో ఆ తల్లికి ప్రేమ, ఆదరణ, మానసిక మద్దతు చాలా అవసరం. ఆమె ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే విమర్శించకుండా, ఓపికగా వినాలి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సరైన వైద్యం, సమయానికి చికిత్సతో పోస్ట్పార్టమ్ డిప్రెషన్ నుంచి త్వరగా కోలుకుని అమ్మ అనే అనుభూతిని ఆనందంగా ఆస్వాదించవచ్చు.