World Diabetes Day 2025: రేపే ప్రపంచ మధుమేహ దినోత్సవం. ఈ దీర్ఘకాల సమస్య ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో రోజురోజుకీ చేపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. షుగర్, మధుమేహం, డయాబెటిస్ ఇలా.. ఏ పేరుతో పిలుచుకున్నా సమస్య మాత్రం ఒకటే. ఈ సమస్య ఒకసారి వచ్చిదంటే.. పూర్తిగా నయం చేసుకోవడం అసాధ్యమే. డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుకోవడం తప్పితే.. వేరే మార్గం లేదు. దీనిని అదుపు చేకపోతే.. గుండెజబ్బులు, పక్షవాతం, మానని పుండ్లు, వేళ్లు, పాదాలు, కాళ్లు తీసేసే ప్రమాదం కూడా రావొచ్చు. ఈ వ్యాధి తీవ్రమైనప్పుడు పూర్తిగా చూపును కోల్పోవడం, కిడ్నీలు పాడవ్వటం వంటి దుష్పభావాలు కలగవచ్చు. కాబట్టి.. ప్రతిఒక్కరూ డయాబెటిస్ మీద సరైన అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. ఈ ఏడాది(2025) ప్రపంచ మధుమేహ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? మన దేశంలో మధుమేహం ప్రభావం ఎంత? కారణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివరాలు తెలుసుకుందాం..
మధుమేహ దినోత్సవం-2025 థీమ్ ఏంటంటే.. ‘పని ప్రదేశంలో మధుమేహ నియంత్రణ’ అనే అంశంపై రూపుదిద్దుకోనుంది. ఉద్యోగులు తమ రోజువారీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పని ఒత్తిడి, అహార అలవాట్లు, అధిక చక్కెరలు తీసుకోవడం, కూర్చునే జీవనశైలి మధుమేహాన్ని పెంచే ప్రధాన కారణాలు కావడంతో ఉద్యోగులు ఈ సమస్యను గుర్తించి మార్పులు చేసుకోవాలి. ఇలాంటి అలవాట్లతోనే డయోబెటిస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది.
భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య ప్రస్తుతం 10.1 కోట్లకు చేరింది. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ డయాబెటీస్ క్రమంగా తన వేగాన్ని పెంచుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం నియంత్రణ, నిరోధం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా నవంబరు 14వ తేదీన ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’గా జరుపుకుంటున్నారు. కెనడాకు చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్ అనే శాస్త్రవేత్త.. 1921లో ఇన్స్లిన్ను కనిపెట్టడంలో ముఖ్యపాత్ర పోషించారు. మధుమేహం కోసం ఇన్సులిన్ను కనుగొనడంలో ఆయన చేసిన కృషికి గానూ 1923లో ఈయనకి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. దీంతో ఫ్రెడరిక్ బాంటింగ్ పుట్టినరోజునే ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుతం మనిషి జీవిన విధానం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులే మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధానం కారణంగా చెప్పవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, చిన్న వయసు నుంచే శారీరక శ్రమకు దూరం కావడం, కల్తీలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ మార్పులు, కొత్త వైరల్ వ్యాధులు.. వంటివి మధుమేహానికి దారితీస్తున్నాయి.
డయాబెటిస్ సమస్యతో జీవించేవారు ఆరోగ్యంగా ఉండాలంటే.. జీవితాంతం అప్రమత్తంగా ఉండాలి. సమస్యకు తగిన మందులు తప్పకుండా వాడుతుండాలి. ఈ మేరకు వైద్యుల సలహాలు పాటిస్తుండాలి. దీంతో పాటు కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం ఎంతో అవసరం. ఎందుకంటే.. బరువు నియంత్రణలో లేకపోతే మనిషి వ్యాధుల నుంచి గట్టెక్కడం అసాధ్యం కాబట్టి.