ఆగస్టు 26.. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఒక్కసారిగా విరుచుకుపడిన వరదలు..అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. భారీ జలప్రళయానికి వేలాది ఇళ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. చైనా-నేపాల్ సరిహద్దుల్లోని గిరాంగ్ పోర్ట్ కాంప్లెక్స్ సైతం పూర్తిగా ధ్వంసమైంది.
ఉవ్వెత్తున దూసుకొచ్చిన బురద నీటి ప్రవాహం..చుట్టుముట్టడంతో అక్కడున్న ఇళ్లన్నీ కూలిపోయాయి. కానీ..గ్రీన్ కలర్లో ఉన్న ఈ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలబడింది. చుట్టూ ఉన్న ఇళ్లు కొట్టుకుపోతుండటంతో ఆ ఇంట్లో ఉన్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వరదను చూస్తుండిపోయారు.
అసలు ఆ బిల్డింగ్ ఉప్పెనలా దూసుకొచ్చిన వరదను తట్టుకొని నిలబడటానికి రీజనేంటి? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇంటి నిర్మాణం, బలమైన పునాది కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు పక్కనున్న ఇళ్లు, చెట్లు వరద ప్రవాహాన్ని అడ్డుకోవడంతో..నీటి తీవ్రత డైరెక్ట్గా ఆ ఇంటిపై నేరుగా పడలేదని చెబుతున్నారు.
ఆ ఇంటిని డిజైన్ చేసిన ఇంజనీర్ గొప్పతనమన్న టాక్ కూడా ఉంది. టెస్లా వాల్వ్ ప్రక్రియ దానికి కారణమని.. దీని వల్ల ప్రవాహం ఒక దగ్గరకు వచ్చే సరికి రెండుగా చీలిపోయి..మధ్యలో ఉన్న ప్రాంతంపై తీవ్రత తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరొకరమో బెర్నౌలీ సిద్ధాంతాన్ని ప్రస్తావించారు.
ఇంటి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లోని కొన్ని భాగాలు ధ్వంసం కావడంతో..వరద నీటికి అడ్డంకి లేకుండా ప్రవహించిందని ఇంకొందరు చెబుతున్నారు. అంటే.. బలమైన పునాది, నిర్మాణ నాణ్యతతో పాటు.. ఇంటి చుట్టూ ఉన్న నిర్మాణాలు, వరద ప్రవాహం దిశ, శిథిలాల ప్రభావం.. ఇలా అనేక అంశాలు కలిసి ఈ ఇల్లు నిలబడటానికి కారణమై ఉండొచ్చని అంటున్నారు.
Also Read: ఏంటీ.. నేపాల్ వరద ప్రవాహ వేగం గంటకు 200 కిమీలా? 4 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి..
ఏదేమైనా.. చుట్టూ ఉన్న ఇళ్లన్నీ కొట్టుకుపోతుంటే.. ఈ ఒక్క బిల్డింగ్ మాత్రం నిలబడటం అందరినీ షాక్కు గురిచేసింది. చివరకు ఇంట్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్స్ సేఫ్గా బయటకు తీసుకొచ్చాయి. దీంతో నేపాల్ వరదల్లో ఈ ఇల్లు ఇప్పుడు మిరాకిల్ హౌస్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.