Bihar Politics: బిహార్ రాష్ట్రం దర్భంగా జిల్లా జాలే బ్లాక్లో ప్రస్తుతం తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ పథకం కింద ఖాతాల్లో జమ అయిన రూ.10,000ను తిరిగి చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పేద లబ్ధిదారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మహిళల కోసం రూపొందించిన పథకం అయినప్పటికీ, పురుషుల ఖాతాల్లో కూడా డబ్బు జమ కావడాన్ని ప్రభుత్వం ఇప్పుడు ‘టెక్నికల్ లోపం’గా చెబుతోంది. అయితే ఆ లోపం మూడు నెలల తర్వాత గుర్తుకు రావడం ఏమిటి అన్నది ప్రధాన చర్చగా మారింది.
మూడు నెలల తర్వాత గుర్తొచ్చిన లోపం
సెప్టెంబర్ 26 తేదీన జాలే బ్లాక్లోని 14 మంది పురుషుల ఖాతాల్లో రూ.10,000 చొప్పున జమ అయ్యాయి. ఆ సమయంలో ఇది ప్రభుత్వ సహాయమేనని భావించిన లబ్ధిదారులు ఆ డబ్బును ఖర్చు చేశారు. కానీ మూడు నెలలు గడిచిన తర్వాత, ఎన్నికలు పూర్తైన తర్వాత, అకస్మాత్తుగా డబ్బు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు రావడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే చెప్పాల్సిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
బల్రాం సహ్ని వేదన
వికలాంగుడైన బల్రాం సహ్ని తన పరిస్థితిని వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పేదవాడినని, ఇప్పుడు రూ.10,000 తిరిగి చెల్లించే పరిస్థితి లేదని స్పష్టం చేశాడు. “మా ఓట్లతోనే వారు గెలిచారు. ఇప్పుడు డబ్బు తిరిగి అడుగుతున్నారు. మూడు నెలల తర్వాత ఈ లోపం గుర్తొచ్చిందా” అంటూ ప్రశ్నించాడు. అతని మాటలు గ్రామంలో పెద్ద చర్చకు దారి తీశాయి.
Also Read: Hair dryers: అమెజాన్లో మహిళల కోసం భారీ ఆఫర్.. హెయిర్ డ్రైయర్లపై బంపర్ డిస్కౌంట్
గ్రామస్తుల ఆగ్రహం
బల్రాం సహ్నికి అతని గ్రామస్తులు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రమిలా అనే మహిళ “మాకు డబ్బు ఇచ్చారు. మేం ఓట్లు ఇచ్చాం. లెక్కలు అయిపోయాయి. మా ఓట్లు తిరిగి ఇస్తే మీ డబ్బు మేం తిరిగి ఇస్తాం” అంటూ ఘాటుగా స్పందించింది. ఈ మాటలు ప్రస్తుతం గ్రామంలో వినిపిస్తున్న భావోద్వేగానికి ప్రతీకగా మారాయి.
లబ్ధిదారుల లాజిక్
నరేంద్ర రామ్ అనే మరో లబ్ధిదారు ప్రభుత్వ వాదనను తిప్పికొట్టాడు. డబ్బు ఖాతాలో జమ అయిన రోజే లేదా కొన్ని రోజుల్లోనే తప్పు జరిగిందని చెప్పాల్సిందని అన్నాడు. ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచిన తర్వాతే నోటీసులు రావడం అనుమానాలు పెంచుతోందని వ్యాఖ్యానించాడు. తాము కూలీలమని, వచ్చిన డబ్బును బట్టలు, ఇంటి అవసరాల కోసం పూర్తిగా ఖర్చు చేశామని తెలిపాడు.
ఎన్నికలు – పథకం ప్రభావం
సెప్టెంబర్ 25 తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద 1.4 కోట్ల మహిళలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ పథకం ఎన్నికల్లో కీలకంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళల భారీ మద్దతుతో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 243 సభ్యుల అసెంబ్లీలో 202 సీట్లు గెలుచుకుంది.
న్యాయం ఎక్కడ అన్న ప్రశ్న
ఇప్పుడు పేదల ఖాతాల్లో వేసిన డబ్బును తిరిగి అడగడం ఎంతవరకు న్యాయమన్న ప్రశ్న బిహార్ అంతటా వినిపిస్తోంది. టెక్నికల్ లోపం పేరిట పేదలపై భారం వేయడం సరికాదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.