Brutal Murder: నమ్మిన భర్తను కాదనుకుని పరాయి వ్యక్తితో పెంచుకున్న కామం.. చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఏడేళ్లుగా సాగుతున్న అక్రమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే కోపంతో, కట్టుకున్నవాడిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన ఘటన బెంగాల్, బిహార్ సరిహద్దుల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తల వేరు చేసి, మృతదేహాన్ని టీ తోటలో పాతిపెట్టిన ఈ దారుణ ఉదంతం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి.
తాంత్రికుడి జీవితంలో ఊహించని మలుపు
బిహార్లోని కిషన్గంజ్లో నివసించే ఇమామ్ ఖువా అనే వ్యక్తి తాంత్రిక పూజలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య మోమినా బేగం. అయితే, మోమినాకు గత ఏడేళ్లుగా సుదీప్ పాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్త కళ్ళు గప్పి ఇన్నాళ్లూ సాగిన ఈ గుట్టు కాస్తా ఇటీవల బయటపడింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఇమామ్, ఆమెను గట్టిగా మందలించాడు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, ఇలాంటి పాడు పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. కానీ, భర్త మాటలు ఆమె తలకు ఎక్కలేదు సరే కదా, అతనిపై పగ పెంచుకునేలా చేశాయి.
స్కెచ్ వేశారు.. మంత్రాల పేరుతో మాయ చేశారు
భర్త బ్రతికుంటే తాము స్వేచ్ఛగా ఉండలేమని భావించిన మోమినా, తన ప్రియుడు సుదీప్ పాల్తో కలిసి అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం వారు ఒక పక్కా ప్లాన్ వేశారు. ఇమామ్ తాంత్రికుడు కావడంతో, అతనికి సులభంగా ఎర వేశారు. పశ్చిమ బెంగాల్లోని బాగ్దోగ్రాలో ఒక పెద్ద తాంత్రిక పూజ ఉందంటూ నమ్మబలికారు. సుదీప్ తన స్నేహితుడి ద్వారా ఇమామ్కు కబురు పంపి, నమ్మకంతో బాగ్దోగ్రాకు వచ్చేలా చేశాడు. డబ్బు, పని దొరికిందనే ఆశతో వెళ్లిన ఇమామ్కు అక్కడ మృత్యువు వేచి ఉందనే విషయం తెలియదు.
టీ తోటలో దొరికిన మొండెం.. బయటపడ్డ నిజాలు
ప్లాన్ ప్రకారం బాగ్దోగ్రా చేరుకున్న ఇమామ్పై సుదీప్ పాల్, అతని ఇద్దరు మేనల్లుళ్ళు కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అతని తలను నరికి అత్యంత దారుణంగా హత్య చేశారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు తల లేని మొండేన్ని అక్కడి ఒక టీ గార్డెన్లో పాతిపెట్టి నిందితులు పరారయ్యారు. కొన్ని రోజులకు తోటలో కార్మికులు టీ ఆకులు కోస్తుండగా, అక్కడ కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల లేని మృతదేహం బయటపడింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహం కిషన్ గంజ్కు చెందిన ఇమామ్ ఖువాగా గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఖాకీల విచారణ.. కటకటాల్లోకి కిరాతకులు
హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, మృతుడి నేపథ్యంపై ఆరా తీశారు. ఈ క్రమంలో భార్య మోమినా బేగం ప్రవర్తనపై పోలీసులకు బలంగా అనుమానం వచ్చింది. ఆమె ఫోన్ కాల్ డేటా, వివాహేతర సంబంధం కోణంలో విచారించగా అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. సుదీప్ పాల్తో ఉన్న అక్రమ సంబంధం వల్లే ఈ హత్య జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. వెంటనే స్పందించిన పోలీసులు ప్రధాన నిందితురాలు మోమినా, ప్రియుడు సుదీప్ పాల్తో పాటు, హత్యకు సహకరించిన అతని ఇద్దరు మేనల్లుళ్లను, మరో స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులంతా కటకటాలపాలయ్యారు.
Also Read: ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి